వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. గత 2020-21 మధ్య జరిగిన కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయందక్కించుకుంది. దీంతో ఆ పార్టీకి చెందిన సురేష్ బాబును మేయర్గా ఎన్నుకున్నారు. అయితే.. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో గత మూడేళ్లలో మేయర్ పీఠాన్ని అడ్డు పెట్టుకుని సురేష్ బాబు చేసిన అక్రమాలు ఇవీ.. అంటూ టీడీపీ కార్పొరేటర్లు.. ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. వీటిలో ప్రధానంగా కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పనులను బినామీల రూపంలో తన కుటుంబానికి చెందిన కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడం ఒకటి.
వీటిపై విచారణ చేసిన ప్రభుత్వం.. అక్రమాలు నిజమేనని గుర్తించింది. దీంతో మేయర్ పదవి నుంచి సురేష్బాబును తప్పించింది. మరోవైపు సుదీర్ఘ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలావుంటే.. తనను మేయర్ పదవి నుంచి తొలగించడంపై సురేష్బాబు న్యాయపోరాటానికి దిగారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగులో ఉంది. మరోవైపు.. మేయర్ను పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో.. కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు కౌన్సిల్ సిద్ధమైంది. కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఈమేరకు ఈ నెల 4న నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నెల 11న కౌన్సిల్ భేటీ ఉందని, ఆ రోజు మేయర్ పోస్టుకు ఎన్నిక జరుగుతుందని తెలిపారు.
అయితే.. సురేష్బాబు మరోసారి కోర్టును ఆశ్రయించారు. తనను తొలగిస్తూ..తీసుకున్ననిర్ణయంపై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని.. ఈ కేసు విచారణ పరిధిలోనే ఉండగా.. ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు.. కార్పొరేషన్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఉందని.. నిబంధనల ప్రకారం.. స్వల్ప కాలానికి మేయర్ పోస్టు ఖాళీ ఉన్నప్పటికీ.. ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలపైనా తాజాగా బుధవారం విచారణ జరిగిన హైకోర్టు.. తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే ఉందని, మేయర్ ఎన్నిక అనేది ప్రజలు వచ్చి ఓటు వేసే విధానంలో లేదని.. ఇది ఎంపిక మాత్రమేనని తెలిపింది. సో.. దీనిని చేపట్టవచ్చని తెలిపింది. అదేసమయంలో తనను అనర్హుడిగా పేర్కొంటూ తప్పించారంటూ.. సురేష్ బాబు వేసిన మరో పిటిషన్కు.. ప్రస్తుత ఎన్నికకు సంబంధం లేదని తెలిపింది.
ఒక వేళ ఆ పిటిషన్లో సురేష్ బాబు విజయం దక్కించుకుంటే.. అప్పుడు కోర్టు ఇచ్చే తీర్పును అనుసరించి.. వ్యవహరిస్తారని కోర్టు స్పష్టం చేసింది. దీంతో వైసీపీ మేయర్ పదవిని కోల్పోయినట్టు అయింది. ఈ నెల 11న ఇక్కడ మేయర్ ఎంపిక జరుగుతుంది. కాగా.. ప్రస్తుతం కడపలో ఎమ్మెల్యే మాధవీ రెడ్డి హవా కొనసాగుతున్న దరిమిలా.. టీడీపీకే ఈ పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates