‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25 మంది ఎంపీల‌లోనూ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎంపీగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 8.9 స్కోర్ తో పెమసాని చంద్రశేఖర్ ఫస్ట్ స్థానాన్ని దక్కించుకున్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది అనేది ఆసక్తికర విషయం. గత ఎన్నికల్లో మొదటిసారి విజయం దక్కించుకున్న పెమ్మసాని ఎన్నారై నాయకుడిగా టిడిపిలో తొలిసారి అడుగు పెట్టారు.

నిజానికి ఆయనకు పార్లమెంటు రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త అనే చెప్పాలి. అయినప్పటికీ ఎంపీల అందరిలోకి మొదటి స్థానంలో నిలబడడం విశేషం. మరి దీనికి ప్రధాన కారణం రాజకీయంగా వివాదాలకు దూరంగా ఉండడం విమర్శలు చేయకపోవడం ప్రజలతో తరచుగా మమేకం కావడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తొలిసారి విజయం దక్కించుకున్నప్పటికీ కేంద్రంలో మంత్రిగా కూడా అవకాశం లభించింది. అటు కేంద్ర మంత్రిగా ఇటు గుంటూరు పార్లమెం టు సభ్యుడిగా పెమసాని ప్రజలకు చేరువ అవుతున్నారు.

ముఖ్యంగా రాజకీయ వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. గుంటూరు రాజకీయాలు అంటేనే వివాదాలకు విమర్శలకు పెట్టింది పేరు. అదే కాదు రాజకీయ అంశాలు కూడా అనేక విభిన్నమైనవిగా తెరమీదకు వ‌స్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆయన ఎక్కడ ఆయా విమర్శలు వివాదాల జోలికి పోకుండా తనదైన శైలిలో ప్రజలకు చేరువకావడం, పార్టీకి అనుగుణంగా పనిచేయడం వంటివి ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టాయి అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

అదే సమయంలో మరో కీలకమైన అంశం రాజధాని. అమరావతి గుంటూరు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. దీంతో ఇక్కడి రైతులు ఎంపీపై చాలా ఆశలు పెట్టుకుంటారు. పైగా కేంద్ర మంత్రిగా కూడా ఉండటంతో ప్రమాసానిపై వారికి మరిన్ని ఆశలు ఆకాంక్షలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఆయన సమన్వయం చేస్తూ రైతులతో కూడా తరచుగా భేటీ అవుతూ వారి సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం తరఫున తాను వారికి భరోసా కల్పిస్తుండడం కూడా ఆయన గ్రాఫ్‌ను పెంచిందన్న భావన వ్యక్తం అవుతుంది.

ఇక గుంటూరులో నెలకొన్న అనేక సమస్యలకు ఇటీవల కాలంలో ఎంపీగా ఆయన నిధులు కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకున్నారు. అభివృద్ధి పనులు కూడా జోరుగా సాగేలా చేస్తున్నారు. ఫ్లై ఓవర్ల నుంచి రహదారుల వరకు గుంటూరులో నిర్మాణాలను చేపట్టారు. ఎంపీ లాడ్స్‌ నుంచి అదే విధంగా కేంద్ర నుంచి కూడా నిధులు వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజల అభిమానాన్ని పొందారనేది తాజాగా చేసిన సర్వేలో స్పష్టమైంది. దీంతోనే ఆయనకి ఏకంగా ఎవరికీ లభించనంత స్కోరు లభించింది, ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకు తిరుగులేదు అన్న వాదన వినిపిస్తోంది.