మోడీ అవినీతి ప్ర‌ధాని అంటున్న మాజీ ఐపీఎస్.. నిజం ఎంత?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యంత అవినీతి ప్రధాని అని మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్ర‌పంచంలోని అవినీతి నాయకుల జాబితాలో మోడీ పేరు కూడా ఉందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. పెద్ద నోట్ల రద్దు నుంచి పన్నుల వసూలు వరకు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజలపై పన్నులు బాదుతూ వారిని గాలికి వదిలేస్తున్నారని వ్యాఖ్యానించారు. వేతనాల్లో 30 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కార్లపై 30 నుంచి 50 శాతం వరకు పన్నులు వేస్తున్నారని పేర్కొన్నారు.

రోడ్డుపన్నులు వసూలు చేస్తూ పెట్రోల్‌పై 60 శాతం సుంకాలు తీసుకుంటున్నారని అయినా ప్రజలను మాత్రం వరదలకు, బురదలకు వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ముంబై వరదల్లో చిక్కుకున్న ఓ కారుకు సంబంధించిన ఫొటోను పోస్టు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో అవినీతి రహిత దేశాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని దోచుకుంటుందని తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. అయితే నిజంగానే ఆయన చెప్పింది నిజమేనా అనేది ప్రశ్న.

అవినీతికి ఆస్కారం ఎక్కడ?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికి 11 సంవత్సరాలకు పైగానే పదవిలో ఉన్నారు. ఆయనపై ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ కూడా రాలేదు. ఆయన మంత్రివర్గ సభ్యులపై కూడా పెద్దగా ఆరోపణలు లేవు. పైగా మోడీకి కుటుంబం లేదు. దీంతో వ్యక్తిగత ఆస్తులు పోగు చేసుకునే అవసరం కూడా ఉండదు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకు రెండు బ్యాంకుల్లో కలిపి 5 లక్షల రూపాయల డిపాజిట్లు మాత్రమే ఉన్నాయి. స్వంతంగా కారు కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఆయన అవినీతి చేశారని ఎలా చెప్పగలరు?

నల్లధనం తెస్తామని అవినీతి రాయుళ్లకు చెక్ పెడతామని చెప్పినట్టు నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేసి విచారణలు జరుగుతున్నాయి. అయితే భారత న్యాయవ్యవస్థలోని కొన్ని loopholes వల్ల నాయకులు వాయిదాలు తెచ్చుకుంటున్నారు. దీన్ని మోడీకి అంటగట్టాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు బీజేపీలోనే అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని పక్కకు పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రగ్యా సింగ్‌ను ప్రధాని మోడీ పక్కన పెట్టారు. గత ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదు.

పెద్ద నోట్ల రద్దుతో అవినీతి అంతం కాలేదన్న వాదనను నాగేశ్వరరావు ప్రస్తావించారు. కానీ ఇటీవల ఆర్బీఐ మరియు ఎస్‌బీఐ విడుదల చేసిన నివేదికల ప్రకారం దేశంలో అవినీతి 2014తో పోల్చితే ఇప్పటికీ సుమారు 44 శాతం తగ్గినట్టు స్పష్టమవుతోంది. అంటే అవినీతి తగ్గిందా లేదా అనేది అంకెలే చెబుతున్నాయి.

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత, పంచాయతీల బలోపేతం వంటి విషయాల్లో మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన దాటవేశారు. ఇలాంటి వాస్తవాలు ఉన్నప్పుడు మోడీపై అవినీతి ముద్ర వేసి లేనిపోని విషయాలను ముడిపెట్టడం ప్రయోజనం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.