ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి మహిళలు, పిల్లలు..ఇలా అన్ని వర్గాలకు ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరెన్నో హామీలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో నిర్దేశిత బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకంపై యావత్ మహిళాలోకం ప్రశంసలు కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పథకాన్ని దివ్యాంగులకూ వర్తింపజేస్తూ సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు.
దివ్యాంగులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు చంద్రబాబు 7 వరాలు ప్రకటించారు. స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్-పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆర్ధిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు పున:ప్రారంభిస్తామని అన్నారు.
శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. బహుళ అంతస్తుల ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజ్తో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్లో చదివే దివ్యాంగ విద్యార్ధులకు అక్కడే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ ఏర్పాటుకు పూనుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా అంధుల క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ దీపికతోపాటు పాడేరుకు చెందిన కరుణకుమారికి ప్రభుత్వం తరపున చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాకుండా వారిద్దరికీ ఇల్లు కట్టిస్తామని హామీనిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates