గూగుల్ డేటా సెంట‌ర్‌.. ఊహించ‌నంత వేగంగా!

విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్న గూగుల్ డేటా కేంద్రం.. ఊహించ‌ని వేగంగా ముందుకు క‌దులుతోంది. భూ సమీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తంగా 506 ఎక‌రాల‌ను గూగుల్ డేటా కేంద్రం, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా కొంత భాగాన్ని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కూడా స‌మీక‌రిస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ఇచ్చిన‌ట్టుగానే ఇక్క‌డ కూడా స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక‌, ఇప్ప‌టికే ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న భూముల‌ను గూగుల్ డేటా కేంద్రానికి బ‌ద‌లాయించేందుకు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. తొలి విడ‌తలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, దాని అనుబంధ‌ భాగస్వామ్య సంస్థలకు భూములు కేటాయిస్తున్న‌ట్టు నోటిఫికేష‌న్‌లో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. నిర్దేశిత స‌మ‌యానికంటే కూడా ముందుగానే భూములు ఇస్తున్నామ‌ని.. కాబ‌ట్టి కార్య‌క‌లాపాలు కూడా అంతే వేగంగా ముందుకు సాగాల‌ని సంస్థ‌ల‌కు సూచించింది.

ఇదేస‌మ‌యంలో గూగుల్ డేటా కేంద్రానికి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన 22 వేల కోట్ల రూపాయ‌ల ప్రోత్సోహ‌కాల్లో త‌క్ష‌ణం ఇవ్వ‌ద‌గిన ప్రోత్సాహ‌కాల‌ను కూడా అందిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనిలో భూమి ఆస్థి ప‌న్ను మిన‌హాయింపు, విద్యుత్ చార్జీలు, నీటి వ‌న‌రుల‌పై టాక్స్‌లు మిన‌హాయిస్తున్నట్టు సర్కారు స్ప‌ష్టం చేసింది. కాగా.. విశాఖ‌లో మొత్తంగా వెయ్యి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయ‌నున్నారు. త‌ద్వారా.. ల‌క్ష మందికి ఉపాధి ద‌క్కుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

గూగుల్‌ సంస్థ మొత్త‌గా 15 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. దీనిలో అదానీ భాగ‌స్వామ్య కంపెనీ లు కూడా ఉన్నాయి. వాటికి కూడా రాయితీలు ఇస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం తాజాగా స్ప‌ష్టం చేసింది.అయితే.. ఏదైనా భాగ‌స్వామ్య కంపెనీ మ‌ధ్య‌లోనే ఉప‌సంహ‌రించుకుంటే.. దాని వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాలి. అదేవిధంగా స‌ద‌రు కంపెనీకి కేటాయించిన రాయితీల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు ప్ర‌భుత్వానికి అవ‌కాశం ఉంటుంది. ఇలా.. మొత్తంగా అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే భూములు అప్ప‌గించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది.