లోకేష్ చెబుతున్న ఆ సైకో ఎవరు?

“మనం ఒక సైకోతో పోరాడుతున్నాం. ఈ విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ అనుక్ష‌ణం గుర్తుంచుకోండి.“ అని మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీకార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు శిక్ష‌ణ శిబిరాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎవ‌రికి వారు సొంత రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్న ఆయ‌న పార్టీకిఒక సిద్ధాంతం.. ఒక లైన్ ఉన్నాయ‌ని.. అదేవిధంగా గ‌తంలో ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకుని ప‌నిచేయాల‌ని సూచించారు.

గ‌తంలో చంద్ర‌బాబును అక్ర‌మంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టార‌ని, టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ‌య‌ట‌కు కూడా రాకుండా నిర్బంధించార‌ని, అనేక‌మందిని చంపేశార‌ని.. ఈ విష‌యాలు దృష్టిలో పెట్టుకుని కార్య‌కర్త‌లు ప‌నిచేయాల‌ని సూచించారు. మ‌నం ఒక సైకోతో పోరాడుతున్నామ‌న్న విష‌యాన్ని ఎవ‌రూ మ‌రిచిపోవ‌ద్ద‌ని నొక్కి చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ప‌నిచేయాల‌ని దిశానిర్దేశం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌న్నారు. అప్పుడే.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌భుత్వం నిర్దేశించిన కార్య‌క్ర‌మాల‌కు త‌ప్ప‌కుండా హాజ‌రు కావాల‌ని సూచించారు.

పార్టీలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారికి త‌ప్ప‌కుండా గుర్తింపు ల‌భిస్తుంద‌ని నారా లోకేష్ చెప్పారు. దీనికి ఉదాహ‌ర‌ణ నిమ్మ‌ల రామానాయుడేన‌ని తెలిపారు. ఒక‌ప్పుడు ఆయ‌న మండ‌ల‌స్థాయి నాయ‌కుడిగా ఉన్నార‌ని.. పార్టీ కోసం అహ‌ర‌హం శ్ర‌మించి.. ఇప్పుడు మంత్రి స్థానానికి ఎదిగార‌ని చెప్పారు. అలానే ప్ర‌తి ఒక్క‌రూ ప‌నిచేయాల‌ని సూచించారు. క‌ష్ట‌ప‌డేవారికి కాకుండా.. ప‌ద‌వులు వేరేవారికి ఇచ్చేది లేద‌న్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు కూడా ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని వివ‌రించారు. గ‌త ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు మ‌రోసారి తీసుకువెళ్లాల‌ని సూచించారు.

“గ‌త ఐదేళ్ల అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోకుండా.. ఎప్ప‌క‌టిప్పుడు వాటిని వివ‌రించాలి. ప్ర‌జ‌ల‌కు ప్ర‌తి విష‌యాన్నీ గుర్తు చేయాలి. ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి పెట్టుబ‌డులు, ఉపాధి, ఉద్యోగాల క‌ల్ప‌న వంటివాటిని కూడా వివ‌రించాలి.“ అని నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఇక‌, నాయ‌కులు, నిర్ణ‌యాల విష‌యంలో పార్టీనే సుప్రీం అని తెలిపారు. ఎవ‌రూ పార్టీని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌ని.. స‌మ‌స్య‌ల వంక‌తో పార్టీని ప‌లుచ‌న చేసే ప‌నులు కూడా చేయొద్ద‌ని హెచ్చ‌రించారు.  ప్రతిఒక్కరూ ‘మై టీడీపీ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, పార్టీ కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు.