అప్పుడు 10 వేలు, ఇప్పుడు 160 కోట్లు – చంద్రబాబు

హైదరాబాద్‌ సిటీ శివారు కోకాపేటలో భూముల ధరలు సరి కొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. గత వారం రెండు దఫాలుగా నాలుగు ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేయగా, ఐదు ఎకరాల స్థలాన్ని ఎకరాకు రూ.151కోట్ల చొప్పున నలుగురు వ్యక్తులు దక్కించుకున్నారు. ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కోకాపేట భూముల ధరల అంశం ప్రస్తావించారు.

‘హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కోకాపేటలో ఎకరా రూ.10 వేలు ఉంటే నేడు రూ.160 కోట్ల వరకూ వెళ్లింది. అభివృద్ది జరిగితే భూముల ధరలు పెరుగుతాయి..’ అని ఆయన స్పష్టం చేశారు. కియా కార్ల పరిశ్రమ రాకతో అనంతపురం పెనుగొండ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ ఎకరం రూ.10 లక్షలు ఉండే భూమి ఇప్పుడు కోట్లలో పలుకుతోందన్నారు.

అదే విధంగా 2027 నాటికి గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు. పోలవరం పూర్తయితే నీటి ఎద్దడి ఉండదు. పొలాలకు రేట్లు పెరుగుతాయి అని తెలిపారు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోనే సుందర నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.