మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన… జనవరి 1 నుండి…

వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేశారు. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ బలహీనపడింది. దీంతో మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని స్పష్టం చేశారు.

ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేర్కొన్నారు. మావోయిస్టుల చర్యలను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు మృతిచెందారు.

ఈ క్రమంలోనే ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లొంగిపోయిన‌ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కూడా కొద్ది రోజుల క్రితం ఒక వీడియో విడుదల చేశారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా.. అని ఆర్ వీడియోలో పేర్కొన్నారు.

కొన్ని దశాబ్దాల కిందట పీడిత ప్రజల కోసం మొదలైన పీపుల్స్ వార్ ఉద్యమం చివరకు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా మారింది. దాడులు, ప్రతిదాడులు.. ప్రతీకార దాడులు కూడా జరిగేవి. రెండేళ్ల నుంచి ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత పోరాటం ఏకపక్షమైపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్కౌంటర్లో జరుగుతున్నాయి. ఉద్యమం వేగంగా బలహీనపడుతూ చివర దశకు వచ్చేసింది.

మావోయిస్టు నేతలు లొంగిపోయారు.. లేదంటే పోలీసుల తూటాలకు ప్రాణాలు వదిలారు. అగ్రనేతలనుకున్న వారు కూడా ఉద్యమానికి భవిష్యత్తు లేదనే భావనతో భారీ సంఖ్యలో క్యాడర్‌ ను తీసుకుని మరీ లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే జనవరి ఒకటో తేదీ నుంచి ఆయుధ విరమణ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.