ఏపీ ఐటీ రాజధాని.. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న విశాఖకు తాజాగా మరో లక్ష కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా కేంద్రం రాకతో.. అనేక పెట్టుబడులు విశాఖను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల ఇక్కడ జరిగిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల వరకు ఒప్పందాలు జరిగాయి. వీటిలో ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి దేశ విదేశీ పెట్టుబడి దారులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, మాల్స్, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు రాను న్నాయి.
ఈ పరంపరలో తాజాగా రిలయన్స్ రూ.98 వేల కోట్లు(దాదాపు లక్ష) పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వాస్తవానికి ఇప్పటికే.. రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. అయితే.. అవి తిరుపతి, విజయవాడ, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో ఉండగా.. తాజాగా విశాఖకు కూడా వస్తున్నట్టు పేర్కొంది. విశాఖలో రిలయన్స్-జేవీ డిజిటల్ కనెక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 98 వేల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనుంది.
దీని ద్వారా ఒక గిగావాట్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. సుమారు 1200-2000 మధ్యలో ఉద్యోగాలు లభించేందుకు అవకాశం ఉంటుందని.. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇక, ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ పెట్టుబడులకు డెస్టినేషన్గా మారుతోందని వ్యాఖ్యానించారు. ఈ మెగా – ప్రాజెక్ట్తో డేటా రంగంలో దేశానికి విశాఖ తలమానికం కానుందని, విశాఖ కీర్తి ప్రపంచం నలుమూలలకు విస్తరిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా మారడానికి సీఎం చంద్రబాబు దూరదృష్టి కారణమని మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఏపీ ఎలా ముందుకు సాగుతుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం మరింత పెరుగుతుందని నారా లోకేష్ తెలిపారు. తద్వారా.. రాష్ట్రంలో యువతకు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates