గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచిందా ? ఓడిందా ?

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పరిస్దితి ఏమిటో బహుశా కేసీయార్ కే అర్ధమవుతున్నట్లు లేదు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో సింగిల్ లార్జెస్టు పార్టీగా గెలిచినందుకు ఆనందించాలా ? మేయర్ పీఠాన్ని కో ఆప్షన్ ఓట్లతో గెలుచుకున్నందుకు సంతోషించాలా ? లేకపోతే పార్టీబలం 99 డివిజన్ల నుండి 56 డివిజన్లకు పడిపోయినందుకు బాధపడాలో కూడా కేసీయార్ కు అర్ధమవుతున్నట్లు లేదు. ఎన్నికలకు ముందుకానీ ప్రచారం సందర్భంలో కానీ కేటీయార్ దగ్గర నుండి ప్రతి ఒక్క నేత టీఆర్ఎస్ సెంచెరి కొడుతుందని, 104 డివిజన్లు తమవే అంటు పదే పదే చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

కానీ ఫలితాలను చూస్తే సీన్ రివర్సయిపోయింది. వెల్లడైన ఫలితాలనే కేసీయార్, కేటీయార్ తో పాటు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏల్లో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్లీనంగా కేసీయార్ పాలనపై జనాల్లో ఉన్న వ్యతిరేకతంతా మొన్నటి దుబ్బాక ఉపఎన్నికల్లోనే బయటపడింది. గెలిచేంత సీన్ లేని బీజేపీ అభ్యర్ధి గెలిచారంటే అర్దం కేసీయార్ పాలనపై ఎంతటి వ్యతిరేకత ఉందో తెలియజెప్పింది. గ్రేటర్ పరిధిలో 26 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి.

26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా గ్రేటర్ పరిధిలోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తన మంత్రివర్గంలోని మంత్రులకే కాకుండా ఎంపిలు, ఎంఎల్ఏలను కూడా డివిజన్లకు ఇన్చార్జిలుగా కేసీయార్ నియమించారు. గెలుపు విషయంలో ప్రతి బృందానికి సీఎం స్పష్టంగా టార్గెట్లు పెట్టారు. అయినా తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఈటెల రాజేందర్ లాంటి చాలామంది మంత్రుల నియోజకవర్గాల్లోని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఘోరంగా ఓడిపోయారు.

ఏదో ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల రూపంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే కో ఆప్షన్ ఓటర్లుగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇటువంటి కో ఆప్షన్ ఓట్లు టీఆర్ఎస్ కు 37 వరకు ఉన్నాయి. అలాగే ఓల్డ్ సిటిలో గెలిచిన 43 ఎంఐఎం కార్పొరేటర్లున్నారు. ఎంఐఎం తరపున ఏడుగురు ఎంఎల్ఏలు, ఎంపి, ఎంఎల్సీలున్నారు కాబట్టి గ్రేటర్ పీఠాన్ని టీఆర్ఎస్ గెలుచుకుంటుందనటంలో సందేహం లేదు.

అయితే 99 డివిజన్ల నుండి 56 డివిజన్లకు పడిపోయినా గ్రేటర్ పీఠాన్ని గెలుచుకున్న టీఆర్ఎస్ ది అసలైన గెలుపా ? లేకపోతే 4 డివిజన్ల నుండి 49 డివిజన్లకు పెరిగిన బీజేపీదే అసలైన విజయమా ? సాంకేతికంగా మాత్రమే టీఆర్ఎస్ గెలిచిందని, నైతికంగా మాత్రం బీజేపీదే అసలైన గెలుపని కమలంపార్టీ మాజీ అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పిందే నిజమా ?