దూరం ఎంతైనా ట్రైన్ టికెట్ 50 రూపాయలే

లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో నానా అవస్థలు పడుతున్నారు వలస కార్మికులు. ఉండటానికి గూడు లేక.. తినడానికి తిండి లేక వాళ్లు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. పెట్టే బేడా సర్దుకుని.. సామానంతా నెత్తిన పెట్టుకుని.. చిన్న పిల్లల్ని ఎండలో రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది.

ఒక చిన్న పాప ఇలా మూడు రోజులు ఎండలో నడిచి స్వస్థలానికి చేరుకుని అక్కడ ప్రాణాలు విడిచింది. ఇంకా వెలుగులోకి రాని దారుణాలు మరెన్నో. వీళ్ల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం.. ఆ తర్వాత కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు ఆందోళనలు కూడా నిర్వహించారు. ఐతే ఎట్టకేలకు వలస కార్మికుల మీద మోడీ సర్కారు దృష్టిపెట్టింది.

వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ రెండు రోజుల కిందటే ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. వారి కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 300 ప్రత్యేక రైళ్లు ఇందుకోసం నడవనున్నాయి. వలస కార్మికులు ప్రభుత్వ అధికారుల్ని సంప్రదిస్తే వారున్న చోటికే బస్సులు పంపి.. రైళ్ల దగ్గరికి తీసుకెళ్లనున్నారు.

కార్మికులు ఎక్కడికి వెళ్లాల్సి ఉన్నా.. అది ఎంత దూరమైనా సరే.. రూ.50 రూపాయలు టికెట్ ధర ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లోని వలస కార్మికుల్ని స్వస్థలాలకు తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుందని.. ఎవరూ బాధ పడాల్సిన పని లేదని ఆయనన్నారు.

ఎవరెవరిని తరలించాలనే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ అధికారులే చూసుకుంటారని.. రాష్ట్రాలు ఇంకా ఎన్ని రైళ్లు కోరితే అన్ని ఏర్పాటు చేస్తామని.. భౌతిక దూరం, సురక్షిత చర్యలన్నీ చేపట్టి కార్మికుల్ని స్వస్థలాలకు తరలిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.