మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వల్ల రూ.6384 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మొంథా తుపాన్ వల్ల వాటిల్లిన నష్టం మదింపు వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది.
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమీబసు, కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె. పొన్నుస్వామీల నేతృత్వంలోని 8 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం సోమవారం ముందుగా అమరావతిలోని సచివాలయానికి వచ్చింది. బృందానికి సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మొంథా తుపాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తుపాను ఎదుర్కోవడానికి ఎంతో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని అధికారులు వివరించారు. సహాయక కార్యక్రమాలు కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టామని తెలిపారు. బుడమేరు వరదల అనుభవంతో ఈ సారి వరద సహాయక చర్యల కోసం 680 డ్రోన్లు ఉపయోగించామని చెప్పారు. అక్టోబరు 27-29 వ తేదీల మధ్య 82.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఇది సాధారణ వర్షపాతం కంటే 9 రెట్టు ఎక్కువన్నారు.
443 మండలాల్లో ఈ తుపాన్ ప్రభావం చూపించిందని, ఈ విపత్తు కారణంగా 3 మృతి చెందారని, 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1,11,402 మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. తుపాను సహాయక చర్యల్లో 12 ఎన్డీఆర్ ఎఫ్, 13 ఎస్డీఆర్ ఎఫ్ బృందాలను, 1,702 వాహనాలను, 110 మంది ఈతగాళ్లను వినియోగించామని వెల్లడించారు. 22 జిల్లాల్లో 2,471 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి1,92,441 మందికి పునరావాసం కల్పించామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates