జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ మరో నాలుగు రోజుల్లో ఉందనగా.. బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంగా దివంగత మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి.. మాగంటి మహానంద కుమారి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి మరణంపై వాస్తవాలను వెల్లడించాలని కేటీఆర్ను ఆమె డిమాండ్ చేశారు. చివరి క్షణాల్లో కన్నకొడుకును చూడనీయకుండా చేశాడని కేటీఆర్పై ఆరోపణలు చేశా రు.
గోపీనాథ్.. ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. కూడా తనకు చెప్పలేదని, ఆయన గురించి ఎవరో చెబితే తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లినా.. లోపలికి రాకుండా తనను అడ్డుకున్నారని కుమారి వ్యాఖ్యానించారు. తర్వాత.. తాను స్వయంగా కేటీఆర్… తన కుమారుడిని చూడాలని వేడుకున్నట్టు చెప్పారు. అయితే.. ఆయన పట్టించుకోకుండా, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తలుపులు వేసేసుకుని వెళ్లిపోయారన్నారు.
ఐసీయూలో మూడు రోజుల పాటు ఉన్నారని.. మాగంటి చనిపోయిన విషయాన్ని కూడా తమకు చెప్పకుండా దాచారని అన్నారు. ఈ విషయంపై తమకు కేటీఆర్ సమాధానం చెప్పాలని మహానంద కుమారి డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమె..ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను మాగంటి సునీతకుఇవ్వడంపై విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సునీత, కేటీఆర్లు కలిసి.. తనను ఐసీయూలోకి కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
“ఆసుపత్రి అధికారులు తల్లి అయినప్పటికీ నన్ను అనుమతించవద్దని వారి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన విషయం కూడా నాకు తెలియజేయలేదు. ఒకసారి, నేను ఐసియు బయట వేచి ఉండి, అనుకోకుండా కెటిఆర్ను కలిశాను. నా కొడుకును చూడటానికి నన్ను అనుమతించమని అభ్యర్థించినప్పటికీ, అతను తలుపు మూసివేసి వెళ్లిపోయాడు,”అని ఆమె వ్యాఖ్యానించారు.
తన కుమారుడి మరణంపైనా కేటీఆర్ స్పందించాలని మహానంద కుమారి డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే.. గోపీనాథ్ మరణం అనంతరం.. ఆరునెలల తర్వాత కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఎదురుదాడికి దిగారు. పోలింగ్ కు నాలుగైదు రోజులముందు కుట్రలు చేస్తున్నారని.. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates