గుంటూరు టీడీపీలో ఎస‌రు పెట్టిన ఎంపీ రాజ‌కీయం

టీడీపీ కంచుకోట‌.. గుంటూరు జిల్లాలో ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? నాయ‌కులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? అనే విష‌యం ఇటీవ‌ల చ‌ర్చకు వ‌చ్చింది. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన కీల‌క నేత‌ల టెలీ కాన్ఫ‌రెన్స్‌లో కొంద‌రు గుంటూరు నాయ‌కులు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌పై ఫిర్యాదులు చేశారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌ల బాణాల‌ను సంధించారు. త‌మ‌కు అందుబాటులో ఉండ‌డంలేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు కూడా అందుబాటులో లేర‌ని.. ఎప్పుడు కార్యాల‌యానికి వ‌స్తారో.. ఎప్పుడు వెళ్తారో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. నేత‌లు ఒక్క పెట్టున విమ‌ర్శ‌ల ప‌ర్వం తెరిచారు. దీంతో చంద్ర‌బాబు ఖిన్నుల‌య్యార‌ట‌.

మ‌రీముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల నోటి నుంచే ఈ విమ‌ర్శ‌లు రావ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింద‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. కొన్నాళ్లుగా అంటే.. గ‌త ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నుంచి కూడా క‌మ్మ వ‌ర్గంలోని చాలా మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగ‌ని వీరు పార్టీని విడిచి పెట్టి పోయే బ్యాచ్‌కాదు. కానీ, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. రాజ‌ధాని ప‌రిధిలోని పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే నుంచి న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి వ‌ర‌కు చోటా.. బ‌డా నేత‌లు.. సీనియ‌ర్లు కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాదిన్న కాలంలో చంద్ర‌బాబు అనేక రూపాల్లో ప్ర‌భుత్వంపై ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు.

అయితే.. ధూళిపాళ న‌రేంద్ర కుమార్ నుంచి కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్, ప్ర‌త్తిపాటి పుల్లారావు వ‌ర‌కు ఎవ‌రూ కూడా చంద్ర‌బాబు ఆదేశాల‌ను విని కూడా విన‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీలో ఒక‌విధ‌మైన నిరాశ చోటు చేసుకుంది. భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌లు ఉన్నా.. కేడ‌ర్ ఉన్నా.. పుంజుకోవ‌డం లేదు. ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు మాత్రం ఇక్క‌డ హ‌డావుడి చేయ‌డం మ‌మ అనిపించి ముగించేయ‌డం త‌ప్ప‌.. మ‌న‌సుపెట్టి ప‌నిచేయ‌డం లేద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. దీనివెనుక ఉన్న రీజ‌నేంట‌ని.. ఆరాతీస్తే.. అంద‌రి వేళ్లూ.. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌వైపే చూపించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న త‌మ‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ ఎంపీ ఓటు త‌న‌కు వేయాల‌ని, ఎమ్మెల్యే ఓటు ఎవ‌రికి వేసుకున్నా అభ్యంత‌రం లేద‌ని ఆయ‌న ప్ర‌చారం చేశార‌ని.. ఇదే త‌మ కొంప ముంచింద‌ని నాయ‌కులు అప్ప‌ట్లోనే ఫిర్యాదులు చేశారు.

అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు సైలెంట్‌గా ఉన్నారు. ఈ ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డ‌క‌పోవ‌డంతో నాయ‌కులు.. ఎవ‌రికి వారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి ఈ ప‌రిస్తితిని చంద్ర‌బాబు ఎలా స‌రిదిద్దుతారో చూడాలి. గ‌ల్లా అంటే.. బాబుకు ఎన‌లేని మ‌క్కువ‌ని.. ఆయ‌న‌ను వెనుకేసుకువ‌స్తున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తుండ‌డం నేత‌ల మ‌ధ్య గూడుక‌ట్టుకున్న అసంతృప్తికి దారితీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.