తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం.. కల్తీ అయిందని.. జంతువుల కొవ్వు కలిసిందని.. ఇదంతా వైసీపీ హయాంలోనే జరిగిందని.. గత ఏడాది జూలై- ఆగస్టుమధ్య పెను వివాదం తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది.. కేవలం రాష్ట్రాన్నే కాకుండా.. దేశాన్ని కూడా కుదిపేసింది. వేలాది మంది శ్రీవారి భక్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.
మరోవైపు ప్రభుత్వం కూడా.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. నకిలీ లడ్డూ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో ఉంది. ఈ క్రమంలో తాజాగా కీలక అంశం వెలుగు చూసింది. వైసీపీ నాయకుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన స్నేహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్గా పోలీసులు గుర్తించిన చిన్న వెంకన్న అన్నీతానై… టీటీడీ వ్యవహారాలను నడిపినట్టు తాజాగా వెలుగు చూసింది. ముఖ్యంగా నకిలీ నెయ్యి వెనుక వెంకన్న కీలక రోల్ ఉన్నట్టు గుర్తించారు.
తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు కోసం.. ప్రయత్నించిన భోలే బాబా సంస్థ నుంచి చిన్న వెంకన్న కిలోకు రూ.25 చొప్పున కమీషన్లు కోరినట్టు సిట్ అధికారులు తాజాగా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇటీవల చిన్న వెంకన్నను అరెస్టు చేసిన(దీనికి ముందే ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు) పోలీసులు.. తాజాగా కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో అనేక అంశాలు ప్రస్తావించారు.
ఇవీ కీలక అంశాలు..
1) టీటీడీ బోర్డును కూడా చిన్న వెంకన్న ప్రభావితం చేశారు.
2) భోలే బాబా సంస్థ నుంచిరూ.25 చొప్పున కిలో నెయ్యికి కమీషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
3) ఆ సంస్థ కమీషన్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో అధికారులపై వత్తిడి తెచ్చి.. దానిని తప్పించారు.
4) అనంతరం.. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థను ఎంపిక చేసేలా చిన్నవెంకన్న చక్రం తిప్పారు.
5) ఈ సంస్థ ఎక్కువ మొత్తంలో కోట్ చేసి.. కమీషన్లు ఇచ్చేందుకు అంగీకరించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates