వైసీపీ వల్ల టీఆర్ఎస్ కు ఎంత లాభం ?

అవును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. మిత్రులెవరో, శతృవులెరో అర్ధం కావటం లేదు. ఇటువంటి పరిస్దితుల్లో అధికార టీఆర్ఎస్ ని ఏపిలో అధికారపార్టీ వైసీపీ ఆదుకునేందుకు సిద్ధమైపోయిందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. వైసీపీ ఏ విధంగా టీఆర్ఎస్ ను ఆదుకోగలదు ? అన్న విషయంపైనే అందరిలోను సందేహాలు పెరిగిపోతున్నాయి.

విషయం ఏమిటంటే గెలుస్తుందో లేదో తెలీదు కానీ గ్రేటర్ పీఠాన్ని గెలిచేసేంత హడావుడి చేస్తోంది బీజేపీ. దీనికి మూలం ఏమిటంటే దుబ్బాక ఉపఎన్నికలో గెలవటమే అని అందరికీ తెలుసు. అయితే ఆ గెలుపు ఊపులో ఉన్న రఘునందనరావు ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ విషయంలో కేసీయార్ ను తీవ్రంగా హెచ్చరించారు. కేసీయార్ ను హెచ్చరిక క్రమంలో ఎంఎల్ఏ ఏమి చేశారంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను పిక్చర్లోకి తీసుకొచ్చారు.

‘పావురాల గుట్టలో ఒకాయన మాయమైపోయినట్లే నువ్వు కూడా గట్లనే మాయమైపోతావు’ అంటూ చేసిన హెచ్చరికతో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ శ్రేణులంతా రెచ్చిపోయారు. ఎంఎల్ఏను తిట్టిన తిట్టు తిట్టకుండా బూతులు తిట్టారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎంఎల్ఏ క్షమాపణ చెప్పుకున్నా వైఎస్సార్ అభిమానులు మాత్రం వెనక్కి తగ్గలేదు.

గ్రేటర్ పరిధిలో సీమాంధ్రుల ప్రభావం సుమారు 35 డివిజన్లలో ఉంటుందని ఓ అంచనా. వీళ్ళలో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఎంతమందని లెక్కగట్టడం కష్టమే. హార్డుకోర్ టీడీపీ అభిమానులు, చంద్రబాబునాయుడు సామాజికవర్గం వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళలో ఎంతో కొంత మంది వైఎస్సార్ అభిమానులు, వైసీపీ శ్రేణులున్నారన్నది మొన్నటి ఘటన తర్వాత అందరికీ అర్ధమైంది. రేపటి ఎన్నికల్లో వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు.

మరి బీజేపీకి వ్యతిరేకమంటే టీఆర్ఎస్ కే పడుతుందని చెప్పలేం. ఎందుకంటే తెలంగాణ వరకు రెడ్లు జగన్ పై అభిమానం ఉన్నా… వారు కేసీఆర్ వ్యతిరేక వర్గమే. అయితే, వాట్సప్ మాధ్యమాల్లో పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు పలకమని పిలుపునిచ్చినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడింది. కాబట్టి తెలంగాణ రెడ్లు ఎటేసినా.. సీమాంధ్ర రెడ్లు, జగన్ అభిమానులు టీఆర్ఎస్ వైపే నిలిచే అవకాశం ఉంది. దుబ్బాక ఎంఎల్ఏ నోటి దురుసు వల్ల బీజేపీకి ఎంత నష్టం జరుగుతుందన్నది పోలింగ్ తర్వాత కానీ తెలీదు.