బీజేపీకి ‘నాన్ లోకల్’ పంచ్!

దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ ఊపులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించాలని ప్రణాళికలు రచించారు కమలం నేతలు. ఎన్నికలకు సిద్ధం కావడానికి, ప్రచారానికి చాలా తక్కువ సమయమే లభించినప్పటికీ.. వారి ప్రణాళికలు మాత్రం భారీగానే కనిపించాయి. రాష్ట్ర స్థాయిలో కీలక నేతలందరూ కలిసి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అలాగే జాతీయ స్థాయి నుంచి చాలామంది నేతలను రప్పించారు.

ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, తేజస్వి సూర్య, యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా.. ఇలా చాలామంది పెద్ద నేతలు ఇక్కడికి వచ్చారు. ప్రచారం నిర్వహించలేదు కానీ.. ఇదే సమయంలో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లడం ద్వారా జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు ప్రధాని మోడీ. ఐతే ఇంతమంది భాజపా నేతలు ఇక్కడికి రావడం వల్ల పార్టీకి ఏమేర ప్రయోజనం చేకూరి ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్న.

స్థానిక ఎన్నికలకు ఇంతమంది జాతీయ స్థాయి నేతలు రావాల్సిన అవసరం ఉందా అన్న సందేహం ఇప్పటికే జనాలకు కలిగింది. అది పక్కన పెడితే.. వీళ్లంతా రావడం వల్ల మంచి కంటే చెడు జరిగి ఉంటుందేమో అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అందుక్కారణం.. ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావడమే. పూర్తిగా స్థానికమైన ఈ ఎన్నికల్లో నాన్ లోకల్ నేతలంతా వచ్చి జనాలకు వేరే ఫీలింగ్ కలిగించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇలా జాతీయ నేతలు వచ్చి ప్రచారం చేస్తే కలిగే ప్రయోజనం వేరు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో మేలు జరగొచ్చు. కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో జనాలకు ‘లోకల్’ ఫీలింగ్ చాలా ఉంటుంది. అప్పుడు స్థానికంగా బలమైన నేతలు రంగంలోకి దిగడం.. మేం మీకు అండగా ఉంటాం, మంచి పాలన అందిస్తాం అన్న భరోసా ఇవ్వడం ముఖ్యం. కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఐతే ఆల్రెడీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉండటానికి తోడు.. అవగాహన లేకుండా ఆయన చేసిన అనేక ప్రసంగాలు పెద్ద మైనస్ అయ్యాయి. దీనికి తోడు ఎక్కడెక్కడి వాళ్లో వచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం, పేరు మారుస్తాం, ముస్లింల ఆధిపత్యాన్ని తగ్గిస్తాం అనేసరికి హైదరాబాద్ జనాలకు రుచించట్లేదన్నది విశ్లేషకుల మాట. దుబ్బాక ఎన్నికల విజయం ఇచ్చిన ఊపును బీజేపీ ఉపయోగించుకోలేదని.. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత మేం తీసుకుంటాం అని చెప్పే బలమైన స్థానిక నేతలు కనిపించకపోవడం బీజేపీకి ప్రతికూలంగా మారిందని.. కాంగ్రెస్, టీడీపీ బలహీన పడ్డ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఓట్లు, సీట్లు పెరగొచ్చేమో కానీ.. అంతకుమించి బీజేపీకి గొప్ప ఫలితాలైతే రాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.