ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందుగా నంద్యాల జిల్లాలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వర్ల దేవాలయంలో పూజా, దర్శనం చేసిన తర్వాత, కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ₹13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాథమిక శిలాన్యాసం చేసి, ప్రారంభిస్తారు – విద్యుత్, రైల్వే, పరిశ్రమలు వంటి రంగాల్లో ఉన్నవి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రకారం, పన్ను స్లాబులను తగ్గించి పేదలు, మధ్యతరగతి వర్గాలకు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు చౌకగా అందేలా చేసింది.
ఈ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలులో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రధానంగా భుజాన వేసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో ప్రధానమంత్రిని ఆహ్వానించి, కర్నూలులో ఈ భారీ బహిరంగ సభకు సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతోంది. మరి దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది ఏమిటి? ప్రధానమంత్రిని ఆహ్వానించటం, దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం వెనుక ఉన్న కారణాలేంటి? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. దీనిని మరింత బలోపేతం చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయం సాధించాలంటే కూటమి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీతో మరింత సాన్నిహిత్యంగా ఉండడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం.
ముఖ్యంగా వైసీపీ ఏ క్షణంలో అయినా బీజేపీతో వ్యవహారాలు నడిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ.ఆది నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉన్న వైసీపీ, వచ్చే ఎన్నికల నాటికి బహిరంగంగా పొత్తు పెట్టుకునే అవకాశాలను కూడా తోసి పుచ్చలేమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీకి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిని బలోపేతం చేయాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే ఇప్పటికి రెండుసార్లు ఏపీకి ఆహ్వానించిన నేపథ్యంలో, ఇప్పుడు మూడోసారి కూడా ప్రధానమంత్రికి పెద్దపేట వేస్తున్నారు. దీనిని ముందుముందు మరింత బలోపేతం చేసుకోవాలని, వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు ఉద్దేశంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని వారు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates