ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది అంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రానున్న నేపథ్యంలో ఢిల్లీలో దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. తాజాగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖకు వచ్చినది అతి పెద్ద భారీ పెట్టుబడి అయినప్పటికీ ఇది ట్రయలరేనని, మున్ముందు విశాఖ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేయబోతున్నామని, భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.
గూగుల్ రాకతో ఏపీకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా తాను ఈ కంపెనీల కోసం పడిన కష్టాన్ని వివరించారు. ఒకప్పుడు చంద్రబాబు ఎలా అయితే మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చేందుకు కృషి చేశారో ఇప్పుడు తాను కూడా అలానే గూగుల్ కోసం కష్టపడ్డానన్నారు. గూగుల్ రాకతో దాని అనుబంధ సంస్థలు, ఇతర పెట్టుబడులు రానున్నాయని వివరించారు. ఇవన్నీ స్థానిక యువతకు మెరుగైన ఉపాధిని కల్పించనున్నాయని తెలిపారు.
ఇలా ఒప్పించారు!
గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు తాను ఎలా ఒప్పించిందీ నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చారు.
ఈ విషయం తెలిసి వారిని కలిశాను.
డేటా కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించాను. వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించాం.
తదుపరి అక్టోబరు నెలలో (గత ఏడాది) అమెరికా వెళ్లి గూగుల్ క్లౌడ్ను కలిశాను.
అదే ఏడాది నవంబర్లో గూగుల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు.
తర్వాత సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కలసి వివరించారు.
భారీ పెట్టుబడులపై అన్ని చోట్లా చర్చలు జరుగుతున్నాయి.
కానీ, అవకాశాలు అవసరం చూసుకుని ఏపీకి తరలి వస్తున్నారు.
ఇది పూర్తిగా చంద్రబాబు విజన్, ఆయన కల్పిస్తున్న అవకాశాలకు నిదర్శనం.
Gulte Telugu Telugu Political and Movie News Updates