దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు భారీ అగ్రిమెంట్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు అనేక పెట్టుబ‌డులు తెచ్చారు. కానీ, మంగ‌ళ‌వారం ఆయ‌న ఢిల్లీలో చేసుకునే ఓ కీల‌క ఒప్పందం మాత్రం ఆయ‌న రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మార‌నుంది. ఈ విష‌యాన్ని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు. తాజాగా అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. మునిసిప‌ల్ శాఖ‌కు చెందిన హెచ్ వోడీని ప్రారంభించారు. అనంత‌రం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి వెళ్తున్నాన‌ని.. భారీ అగ్రిమెంట్ చేసుకుంటున్నాన‌ని చెప్పారు. ఇది ఏపీకి గేమ్ చేంజ‌ర్‌గా మారుతుంద‌ని చెప్పారు. ఈ ఒప్పందంతో ఏపీ భ‌విత కూడా మారుతుంద‌న్నారు.

ఏంటీఒప్పందం..

గూగుల్ స‌హ సంస్థ రైడైన్‌తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంటోంది. దీని విలువ ఏకంగా 90 వేల కోట్ల రూపాయ‌లు. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి వ‌చ్చిన అతి పెద్ద పెట్టుబ‌డి. ఈ సంస్థ విశాఖ‌లో అతి పెద్ద డేటా కేంద్రాన్నిఏర్పాటు చేయ‌నుంది. 2029 నాటికి డేటాసెంటర్‌ను సంస్థ పూర్తి చేస్తుంది. అయితే.. దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రం ఇదే కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. నిజానికి అటు గూగుల్ సంస్థ హిస్ట‌రీలో కూడా భార‌త్‌లో ఇంత పెద్ద పెట్టుబ‌డి పెట్ట‌డం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అది కూడా ఏపీలో పెట్ట‌డం గ‌మ‌నార్హం.

దీనివెనుక‌.. మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ ఉన్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఇక‌, ఈ డేటా కేంద్రం ఏర్పాటుతో విశాఖ‌ప‌ట్నం `డేటాసెంటర్‌ హబ్‌`గా మారుతుంది. ఏఐ, హైఎండ్‌ ఉద్యోగాలు వ‌స్తాయి. డేటా సెంటర్‌కు సింగపూర్‌ నుంచి సబ్‌మెరైన్‌ కేబుల్‌ను సముద్రమార్గంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. దీనికి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించ‌నుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్  కూడా స‌హ‌క‌రించార‌ని సీఎం చంద్ర‌బాబు తాజాగా వెల్ల‌డించారు.