తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో ఆది నుంచి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు కోసం తహ తహలాడుతున్న కౌశిక్ రెడ్డి.. తాజాగా మరో కుంపటి నెత్తిన పెట్టుకున్నారు. తాను పెట్టుకున్నదే కాకుండా.. పార్టీని కూడా బజారున పడేశారు. గత 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్నారు. ఆ సమయంలో ఆయన కుటుంబంతో సహా.. సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ దఫా గెలిపించకపోతే.. తాను పాడె ఎక్కుతానని నియోజకవర్గ ప్రజలను సెంటిమెంటుతో ఆకట్టుకున్నా రు. ఇదివివాదం కూడా అయింది.
ఇక, ఆ తర్వాత పాడి గెలవడం.. అనేక సందర్భాల్లో ఆయన వివాదాలను నెత్తిన వేసుకుని యాగీ చేయడం తెలిసిందే. దీనివల్ల బీఆర్ఎస్కు చిన్నపాటి ప్రయోజనం కూడా లభించలేదు. అయినా.. కూడా.. పాడి మాత్రం తన దూకుడును తగ్గించడం లేదా.. సొంత పార్టీ అనుకూల వాదులను, పార్టీ నాయకులను కూడా ఆయన బెదిరించారు. అలా ఇలా కాదు.. ఏకంగా తీవ్రస్థాయిలో బెదిరించారు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికల రంగం రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలను కౌశిక్ రెడ్డి కలుస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా కమలాపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. “బీఆర్ఎస్ తరఫున గెలిచి.. తర్వాత వేరే పార్టీలలోకి మారితే.. తుక్కుతుక్కు కింద చిత్తు రేగ్గొడతం!” అంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకులను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు.. “ఎవడైనా.. ఇప్పుడు గెలిచి.. తర్వాత.. వేరే పార్టీలోకి చేరితే.. వెయ్యి మందితో ఇళ్లపైకి వచ్చి.. చుక్కలు చూపిస్తం. తుక్కు రేగ్గొడతాం” అని పదే పదే వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు.. ఆవేశంలో అన్నారో.. ఆవేదనతో అన్నారో తెలియదు కానీ.. కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు నాయకులు రెడీ అయ్యారు. అంతనమ్మకం లేనప్పుడు.. తాము పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంతేకాదు..కౌశిక్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తామంటే.. జంపైపోడా? అని ఒకరిద్దరు నిప్పులు చెరిగారు. అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని.. నోరేసుకుని.. కార్యకర్తలు, నాయకులను అవమానించేలా మాట్లాడితే.. ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ అంతటివారే అందరినీ నమ్ముతున్నారని.. ఈయనెంత? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates