మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ ఉండరా?

తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. ఇప్పుడీ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్నిచూస్తే ఇట్టే అర్థం కాక మానదు. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి.. తెలంగాణ అధికారపక్షం ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పక్కా ప్లాన్ సిద్దం చేసుకొని.. రోడ్ మ్యాప్ వేసుకున్న గులాబీ బాస్ కు.. కమలనాథులు ఇస్తున్న షాకులు భారీగా తగులుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు గాలి వాటంగా వచ్చిందే తప్పించి.. కేసీఆర్ మీద అంత వ్యతిరేకత లేదన్న మాట వినిపించింది.

గ్రేటర్ ఎన్నికల ప్రచారం సాగుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం మారటమే కాదు.. సమీకరణాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఏకు అనుకున్న బీజేపీ ఇప్పుడు మేకుగా మారిందని చెబుతున్నారు. పోలింగ్ కు దగ్గరవుతున్న కొద్దీ.. టీఆర్ఎస్ బలం తగ్గుతూ ఉంటే.. బీజేపీ బలం అంతకంతకూ పెరుగుతోందని చెబుతున్నారు. అదే సమయంలో ఇరు పార్టీల మధ్య పోరు పెరుగుతోంది. మాటలు తూటాలు మాదిరి పేలుతున్నాయి. ఘాటు విమర్శలు చేస్తున్నారు.

టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్న మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనూ రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సహకారం అందించటం లేదని చెప్పటమే కాదు.. రానున్న రోజుల్లో తాను ప్రధాని కావాలన్న ఆకాంక్ష ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు కేవలం మూడురోజుల ముందు ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారు కావటం ఆసక్తికరంగా మారింది.

శనివారం నగరానికి వస్తున్న ఆయన.. కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న భారత్ బయోకాన్ సంస్థను సందర్శించనున్నారు. హైదరాబాద్ శివారులోని హకీంపేటకు మోడీ చేరుకునే సమయానికి టీఆర్ఎస్ అధినేత కమ్ ముఖ్యమంత్రి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన కీలకమైన బహిరంగ సభను ఎల్ బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఇరువురు ప్రముఖుల కార్యక్రమాలు ఒకే సమయంలో జరుగుతున్నందున.. రాష్ట్రానికి వస్తున్న ప్రధానిని స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లే అవకాశం లేదంటున్నారు.

ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ హాజరవుతారు. సీఎం కూడా వెళతారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వెళ్లే అవకాశం తక్కువ అంటున్నారు. తమ బహిరంగ సభను పక్కదారి పట్టించటంతో పాటు.. అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకోవటానికి ప్రధాని మోడీ ప్రోగ్రాంను హడావుడిగా ఏర్పాటు చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల వేళ హైదరాబాద్ కు వస్తున్న ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ కలుస్తారా? లేదా? ఎవరి దారి వారిదన్నట్లుగా ఉంటారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.