జ‌గ‌న్‌ను ఊహ‌కంద‌ని దెబ్బ కొట్టిన చంద్ర‌బాబు!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తమకు మేలు చేస్తాయని ఆ పార్టీ నాయకులు పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తమకన్నా మించి ఎవరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేరని, ప్రజలకు సొమ్ములు కూడా ఇవ్వలేరని వారు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అదే చెబుతున్నారు. అయితే అనూహ్యంగా సీఎం చంద్రబాబు వైసీపీ కన్నా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు జగన్ హయాంలో ఇచ్చిన దానికన్నా కూడా అధికంగా నిధులు ఇస్తున్నారు.

ఇది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు పాలనలో ఒక కీలక ఘట్టం అనే చెప్పాలి. నిజానికి ఉచిత పథకాలకు చంద్రబాబు చాలా వ్యతిరేకంగా ఉంటారు. కష్టించి సొమ్ము చేసుకోవాలనే ప్రాతిపదికనే ఆయన ప్రజలకు అనేక పథకాలను తీసుకువచ్చారు. కానీ, వైసీపీ హయాంలో అమలు చేసిన కొన్ని పథకాలకు ప్రజలు అలవాటు పడటం, పేదలకు అవి నిజంగానే సంక్షేమాన్ని అందించిన నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ కన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఎక్కువ మొత్తంలో నిధులను కూడా అందిస్తున్నారు.

వైసిపి హయాంలో అమ్మ ఒడి పేరుతో 13 వేల రూపాయలు చొప్పున ఇస్తే అది ఒక ఇంటికి మాత్రమే ఒక కుటుంబంలోని ఒక విద్యార్థికి మాత్రమే అందింది. దీని స్థానంలో చంద్ర‌బాబు ‘తల్లికి వందనం’ పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా 13 వేల రూపాయలు చొప్పున అందించారు. సో.. ఇది ఒక రికార్డుగా ప్రభుత్వానికి మారింది. ఇక, ఇప్పుడు తాజాగా ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పేరుతో ఇస్తున్న పథకం కూడా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. వైసీపీ హయాంలో ‘వాహన మిత్ర’ పేరుతో పదివేల రూపాయలు ఇచ్చారు.

కానీ, ప్రస్తుత చంద్ర‌బాబు ప్రభుత్వం 15000 రూపాయలు ఇస్తోంది. అంటే దాదాపు 5వేల రూపాయలు ఎక్కువ చేసి ఇవ్వటం అనేది రికార్డ్ ను సృష్టిస్తుందన్నది టిడిపి నాయకులు చెబుతున్న మాట. ఫలితంగా ఇప్పటివరకు తామే సంక్షేమానికి పునాదులు వేసామని తాము తప్ప ప్రజలకు నిధులు ఇవ్వలేరని చెబుతూ వచ్చిన వైసీపీ నాయకులకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలోని రెండు లక్షల 90 వేల మందికి పైగా డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల చొప్పున 436 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో వెయ్యనుంది.

ఇది నిజానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కాదు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే ఉండగా.. దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని డ్రైవర్లు చెప్పడంతో చంద్రబాబు అప్పటికప్పుడు తీసుకున్నాయని నిర్ణయం. సో ఎలా చూసుకున్నా వైసిపి హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు డబుల్ బోనాంజానే ప్రజలకు అందిస్తున్నాయి అన్నది వాస్తవం.