ప‌నే కాదు.. ప‌ద్ధ‌తీ బాగుండాలి ఎమ్మెల్యే మేడమ్స్‌..!

రాజకీయ నాయకులు ప్రజల మధ్యకు రావడం, పనులు చేయటం కామన్. ఆయా నాయకులకు ఇవి అవసరం కూడా. అయితే పనులు చేయటం వరకు బాగానే ఉన్నా దూకుడుగా వ్యవహరించడం మాత్రం ఏ నాయకుడికి కలిసివచ్చే అంశంగా చెప్పలేం. ఇదే ఇప్పుడు టిడిపి నాయకులకు శాపంగా మారిందని చెప్పాలి.

కొందరు నాయకులు దూకుడుగా ఉంటున్నారు. మరి కొందరు నాయకులు ప్రజలకు చేరువవుతున్నారు. ఇంకొందరు మాత్రం అటు పనులు చేస్తూనే ఇటు వివాదాలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. దీంతో ఎంత పని చేసాం అన్నది పక్కన పెడితే వివాదాలు మాత్రం వీరిని చుట్టుముడుతున్నాయనే చెప్పాలి.

దీంతో పనిచేయడమే కాదు, పద్ధతిగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది నాయకులు తెలుసుకోవాల్సి ఉంది. ఉదాహరణకు కడప ఎమ్మెల్యే మాధవి, అదేవిధంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఇద్దరూ ప్రజలకు చేరువవుతున్నారు. సమస్యలపై స్పందిస్తున్నారు. అధికారులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. పనితీరు విషయంలో వీరికి రిమార్కు లేకపోయినా వ్యక్తిగతంగా చూస్తే మాత్రం వీరి వ్యవహార శైలి వివాదాలకు దారితీస్తోంది.

లోకం మాధవి స్థానిక నాయకులను కలుపుకొని వెళ్లలేకపోతున్నారన్న విమర్శలు కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక కడప ఎమ్మెల్యే మాధవి కూడా పార్టీలో సఖ్యత లేదన్న విషయం స్పష్టంగా కనపడుతోంది. దీంతో వారు ఎంత పని చేస్తున్నా కూడా ఇటు ప్రజల్లోనూ అటు పార్టీలోనూ మార్కులు వేయించుకోలేకపోతున్నారన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం.

వాస్తవానికి ఎంత బాగా పనిచేశామన్నది ముఖ్యమైనా, అదే సమయంలో వివాద రహితంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా నాయకులకు ఉంటుంది. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా మళ్లీ ఎన్నికల సమయానికి నాయకులు పుంజుకోవడం కష్టం.

ఇక మరికొందరు పనులు చేయకపోయినా ప్రజలతో కలివిడిగా ఉంటున్నారు. ఇంకొందరు అటు పనులు చేయకుండా ఇటు వివాదాలకు దూరంగా ఉంటూ తమ సొంత వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నారు. మొత్తంగా చూస్తే పనులు చేసే వాళ్లేమో వివాదాలకు కేంద్రంగా మారుతుండడం, పనులు చేయని వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోవడం వంటివి పార్టీలకు ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి.

మరి ఎమ్మెల్యేలు ఈ విషయంపై ఆలోచన చేసి మార్పు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.