ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దుష్టులను ఉపేక్షించకూడదదని, 2019-2024 మధ్యలో పండుగలు చేసుకునే పరిస్థితి లేదని, స్వేచ్ఛగా తిరిగి పరిస్థితి లేదని అన్నారు. జగన్ పరదాల్లో వచ్చే వారని, కానీ, తాము సరదాగా స్వేచ్ఛగా 14 కి.మీ దూరం ప్రజల మధ్య, ప్రజలతో ప్రయాణించి వచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదని గుర్తు చేశారు. తన జీవితంలో జగన్ వంటి వ్యక్తిని చూడలేదన్నారు.
ఇటువంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికి వస్తారా అంటూ ఆటో డ్రైవర్లను ప్రశ్నించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటామని, అదే విధంగా వైసీపీపై కూటమి ప్రభుత్వం సాధించిన విజయం 2024 ఎన్నికల విజయం అని అన్నారు. మరోసారి, ఆ దుష్టశక్తులు అధికారంలోకి రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
అన్నీ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇంకా ఆలోచిస్తుంటారని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకొకడొస్తే ఏదో ఇస్తాడు అని అనుకుంటారని, కానీ, అన్నీ పీకేస్తాడన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. గుజరాత్ లో 25 ఏళ్లుగా బీజేపీ పాలన ఉందని, అందుకే గుజరాత్ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉందని, సుస్థిర పాలన దానికి కారణమని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఏపీలో సమర్థవంతంగా పనిచేస్తున్నామని చెప్పారు.
2 లక్షల 90 వేల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఒక యాప్ తీసుకువస్తున్నామని, నేరుగా ఆ యాప్ నుంచి బుకింగ్ చేసేలా రూపొందిస్తామని చెప్పారు. 24 గంటలు ఆటో స్టాండ్ లో పడిగాపులు కాచే పరిస్థితి ఉండదన్నారు. అవసరమైతే, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, డ్రైవర్లనే సభ్యులుగా చేస్తామని అన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని, యాప్ నిర్వహణ కూడా డ్రైవర్లు చేపట్టేలా చూస్తామని అన్నారు. వినూత్న ఆలోచనలు డ్రైవర్లు కూడా సహకరించాలని, డ్రైవర్లందరికీ అండగా ఉంటామని అన్నారు. మీకు మంచి చేసిన ప్రభుత్వం గురించి 10 మంది ప్రయాణికులకు చెప్పాలని, డ్రైవర్ల బంగారు భవిష్యత్తు బాధ్యత తమ ప్రభుత్వానిదని అన్నారు. దసరా పండుగ అయిపోయిందని, ఓజీ చూశారని, ఇది ఆటో డ్రైవర్ల పండుగ అని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates