సినిమా కార్యక్రమం కావొచ్చు. క్రీడా ప్రోగ్రాం కావొచ్చు. రాజకీయ.. అధ్యాత్మికం.. ఇలా రంగం ఏదైనా.. ప్రజలు పెద్ద ఎత్తున తాము అభిమానించి..ఆరాధించే వారిని చూసేందుకు.. వారు పాల్గొనే కార్యక్రమాలకు హాజరయ్యే విషయంలో వారి అభిమానులు ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి అమాయకులు తరచూ వారు అత్యంతగా అభిమానించే కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోతున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి.
కొన్ని రోజుల కిందట కరూర్ పట్టణంలో నిర్వహించిన రాజకీయ సభకు పెద్ద ఎత్తున హాజరైన ఆయన అభిమానులు.. అక్కడ జరిగిన తొక్కిసలాకు బలయ్యారు. 41 మందికి పైనే తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకున్న వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ అటు కేంద్రం.. ఇటు స్టాలిన్ నేత్రత్వంలోని ప్రభుత్వంతో పాటు..విజయ్ సైతం భారీ ఎత్తున పరిహారాన్ని ప్రకటించటం తెలిసిందే.
ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇస్తున్న ఆర్థిక సాయం భారీగా ఉన్నా.. వారికి.. వారి కుటుంబాలకు జరిగిన నష్టంతో పోల్చినప్పుడు చాలా తక్కువ. ఇదిలా ఉంటే..అసలు ఇంత భారీగా చేపట్టే కార్యక్రమాల్లో ‘క్రౌడ్ మేనేజ్ మెంట్ సిస్టం’ పక్కాగా లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోనూ ప్రస్తావించారు. అయితే.. ఈ క్రౌడ్ మేనేజ్ మెంట్ విషయంలో అటు నిర్వాహకులు.. ఇటు పోలీసులు ఇద్దరూ వైఫల్యం చెందారనే చెప్పాలి.
పది వేల మందికి అనుమతి తీసుకున్న రోడ్ షోకు ఏకంగా లక్ష వరకు రాగా.. పోలీసులు సైతం అంతకంతకూ పెరుగుతున్న సంఖ్యను చూసి దానికి తగ్గ చర్యలు తీసుకోవాల్సి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన ర్యాలీ.. ఆలస్యంగా మొదలు కావటం మాత్రమే కాదు.. మధ్యాహ్న వేళకు సభా వేదిక వద్దకు రావాల్సిన విజయ్.. సాయంత్రం ఏడు గంటల వరకు రావటంతో అభిమానుల సంఖ్య అంచనాలకు మించి చేరిపోయింది.
ఇక్కడే రెండు అంశాల్ని ప్రస్తావించాలి. విజయ్ ఆయన పార్టీకి చెందిన వారు తమ బలాన్ని పెద్ద ఎత్తున ప్రదర్శించాలని భావించటం ఒక ఎత్తు అయితే.. వారి కారణంగా చోటు చేసుకునే పరిణామాలను పోలీసులు అంచనా వేయకపోవటం మరో తప్పిదంగా చెప్పక తప్పదు. అంతేకాదు.. పెద్ద ఎత్తున ఉదయం నుంచి రాత్రివరకు వేచి చూస్తున్న అభిమానులకు అవసరమైన మంచినీళ్లు.. ఇతర సౌకర్యాలు అందుబాటులో లేనప్పటికి.. వాటిని పట్టించుకోని విజయ్ సన్నిహితుడు.. పార్టీ సీనియర్ నేత ఎన్ ఆనంద్ పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇవన్నీకలిసి నలభై నిండు ప్రాణాల మీదకు తీసుకురావటమే కాదు.. మరో యాభై మంది గాయాల బారిన పడి ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి.
క్రౌడ్ మేనేజ్ మెంట్ విషయంలో వైఫల్యం చెందటం ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతుందని చెప్పాలి. ఇటీవల కాలంలోచోటు చేసుకున్న పరిణామాలు దీనికి నిదర్శనంగా చెప్పాలి. మొన్నటికి మొన్న ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన ఆర్ సీబీ జట్టు విజయోత్సవాల్ని బెంగళూరులో నిర్వహించటం.. ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11మంది ప్రాణాలుపోవటం కూడా క్రౌడ్ మేనేజ్ మెంట్ లోచోటు చేసుకున్న వైఫల్యంగా చెప్పాలి.
పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య 70ఎంఎం థియేటర్ లో అభిమానులుఒక్కసారిగా దూసుకురావటంతో.. ఒక మహిళ మరణించటం..ఆమె కుమారుడు తీవ్రగాయాలతో జీవచ్ఛవంగా మారిపోవటం తెలిసిందే. ఇవే కాదు.. క్రౌడ్ మేనేజ్ మెంట్ వైఫల్యంలో మరెన్నో విషాద ఉదంతాలుచోటు చేసుకున్న పరిస్థితి. ఇక్కడ.. నిర్వాహకుల్ని నిందించే వేళ.. శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోవటం కూడా కనిపిస్తుంది.
అలాంటి కొన్ని ఉదంతాల్ని చూస్తే.
2016 ఏపీలోని విజయవాడలో
వైఎస్సార్ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన భారీ సభలో జనసమూహం పెద్ద ఎత్తున రావటంతో నియంత్రణ తప్పిన ఉదంతంలో తొక్కిసలాట చోటుచేసుకోవటం.. ముగ్గురు మరణించటం తెలిసిందే.
2018 తమిళనాడులోని తిరుచ్చిలో..
ద్రవిడ నేత శివాజీ గణేషన్ విగ్రహ ఆవిష్కరణ సభలోనూ తొక్కిసలాట జరిగి ఇద్దరు మరణించగా.. అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఉదంతంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.
2019 కర్ణాటకలోని మైసూర్ లో..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో కారణంగా భారీ జనసమూహం రావటంతో వారిని కట్టడి చేయటం సాధ్యం కాలేదు. ఫలితంగా పలువురికి గాయాలు అయ్యాయి. లక్కీగా ప్రాణ నష్టం తప్పింది. జన సందోహం వీఐపీ వాహన వైపు వచ్చిన వేళ.. సదరు వాహనాన్ని మార్గాన్ని మళ్లించటంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది.
20022 ఖమ్మంలో..
కేసీఆర్ సభలో బహుమతులు.. ఫుడ్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న వేళ చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా.. 20 మంది గాయపడ్డారు.
2022 హైదరాబాద్ లో.
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రికెట్ టికెట్ల అమ్మకాల సమయంలో భారీగా అభిమానులు చేరటం.. టికెట్ల కోసం చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒకరు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉదంతంలోనూ క్యూలైన్లు సరిగా లేకపోవటం.. క్రౌడ్ మేనేజ్ మెంట్ వైఫల్యం ఈ విషాద ఘటనకు కారణమైంది.
2022 నెల్లూరులో
చంద్రబాబు నాయుడు రాజకీయ సభలో జనాభా ఎక్కువ అయిపోవడంతో పరిస్థితి అదుపుతప్పి 8 మంది చనిపోయారు.
ఇదే విధంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల వేళ ఇలాంటి ఉదంతాలే చోటు చేసుకున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు కనిపించేది ఒక్కటే క్రౌడ్ మేనేజ్ మెంట్ వైఫల్యం. ఈ విషాద ఉదంతాల ద్వారా అటు నిర్వాహకులు.. ఇటు పోలీసులు గుణపాఠాల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates