గ్రేటర్ ప్రచారానికి ఇంతమంది అవసరమా ?

పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల హీట్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. జనాలను ఆకర్షించేందుకు, ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు అన్నీ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడిపోతున్నాయి. జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అన్నీ హద్దులను కూడా దాటిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. అయితే ఈ నేపధ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈనెల 29వ తేదీన హైదరాబాద్ కు వస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. మోడితో బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా కూడా వస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం చేయబోతున్నారు.

ఎన్నికల్లో ఎంతగా గ్రేటర్ అని ఉన్నా జరుగుతున్నదయితే గల్లీ ఎన్నికలే అన్నది వాస్తవం. మరి ఇంతోటి ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ తరపున కేంద్రమంత్రులు, జాతీయ అధ్యక్షుడు, స్వయంగా ప్రధానమంత్రే వస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. మోడి హైదరాబాద్ కు వస్తున్నారని మాత్రమే చెబుతున్నారు కానీ ఎన్నికల ప్రచారం గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే ప్రచారం ముగిసే ముందు రోజు సరిగ్గా మోడి హైదరాబాద్ కు వస్తుండటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న కోవిడ్ 19 టీకా అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మోడి వస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి మోడి వచ్చి చూసేదేమీ లేదని అందరికీ తెలుసు. సో, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పనిలో పనిగా ఎన్నికల ప్రచారంలో కూడా మోడి పాల్గొంటారనే అంటున్నారు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే అమిత్ షా కూడా ప్రచారానికి రాబోతున్నారు. ఇఫ్పటికే ప్రకాష్ జవదేకర్, స్మృతీ ఇరానీ ప్రచారం చేశారు. కిషన్ రెడ్డి అయితే ఇక్కడే క్యాంప్ వేశారు. కిషన్ అంటే స్ధానికుడు కాబట్టి క్యాంపు వేయటంలో ఆశ్చర్యం లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రచారం చేశారు. నడ్డా ప్రచారానికి రాబోతున్నారు. గ్రేటర్ సమరంలోకి ఇంతమంది జాతీయ నేతలను ఎందుకు బీజేపీ పిలిపిస్తోందో అర్ధం కావటం లేదు.

బీజేపీ వ్యూహం చూస్తుంటే ఓటర్లను మెంటల్ గా ఫిక్స్ చేసే ఉద్దేశ్యంతోనే మైండ్ గేమ్ ఆడుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే సత్తా కమలంపార్టీకి లేదన్నది వాస్తవం. ఏదో దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన కారణంగా గ్రేటర్ లో రెచ్చిపోతోందంతే. దుబ్బాకలో గెలిచినంత మాత్రాన గ్రేటర్ లో గెలుస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ గెలిచిందనే అనుకున్నాం. రాష్ట్రప్రభుత్వాన్ని కాదని బీజేపీ ఏమి చేయగలుగుతుంది ? ఇక్కడే కమలంపార్టీ సమాధానం చెప్పలేకపోతోంది. మరి ఇంతోటి దానికి ఇంతమంది జాతీయ నేతలు అవసరమా ?