భాగ్యనగరం.. హైదరాబాద్.. చిన్న చినుకునే ఓర్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఏ చిన్నపాటి వర్షం కురిసినా… భాగ్యనగరం వీధులన్నీ జలమయం అవుతున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరుతోంది. అయితే.. ఇది ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం అభాగ్య నగరంగా విలపిస్తోంది. అక్కడ, ఇక్కడ అనే తేడాలేకుండా.. దాదాపు అన్ని ప్రాంతాలూ నీట మునిగాయి. జంట జలాశయాలకు నీటి వరద పోటెత్తడంతో వాటి గేట్లను ఓపెన్ చేశారు. మరోవైపు మూసీ నది ప్రవాహం ఉరకలెత్తుతోంది.
ఈ పరిణామాలతో మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ నీటిలో చిక్కుకున్నాయి. మోకాల్లోతు కాదు.. కొన్నిచోట్ల పీకల్లోతు నీరు చేరి ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో.. వచ్చి పోయే వందలాది బస్సులతో కళకళలాడే ఎంజీబీఎస్ బస్టాండు.. భారీ చెరువును తలపిస్తోంది. అదేవిధంగా ప్రఖ్యాత ఆలయాలు కూడా.. నీటమునిగాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 30 వేల మందికి పైగా కుటుంబాలు నిరాశ్రయలయ్యాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తరలించలేని చోట్ల .. ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దింపి.. శనివారం మధ్యాహ్నం.. ఆహారం, నీరు సరఫరా చేశారు. అంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోంది.
మరోవైపు ఉరుముతున్న ఆకాశం వైపు ప్రజలు ఆగ్రహంతో చూస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రహదారులు మునిగిపోయి.. కట్టలు తెగిన వాగులు ఊళ్లకు ఊళ్లను ముంచేసిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వైపు నుంచి సహాయక చర్చలు కొనసాగుతున్నా.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉండడంతో అవి చాలడం లేదన్న వాదనా వినిపిస్తోంది. హైడ్రా అధికారులు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. సహాయక సిబ్బందిని సిద్ధం చేశారు. ఆపన్న హస్తం అందిస్తున్నామని హైడ్ర కమిషన్ రంగనాథ్ చెబుతున్నారు.
ఇతర జిల్లాల్లో కూడా..
తెలంగాణలోని హైదరాబాదే కాకుండా.. సంగారెడ్డి, వికారాబాద్ సహా పలు జిల్లాల్లోనూ పరిస్థితి భీకరంగా మారింది. చెరువులు తెగిపోయాయి. చిన్నపాటి వాగులు ఆనవాలు లేకుండా పోయాయి. రహదారులు కొట్టుకుపోయాయి. ఇక, సాగు రైతుల కష్టాలు చెప్పడానికి వీల్లేని విధంగా ఉన్నాయి. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి దారుణంగా తయారైంది. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇదిలావుంటే.. చాలా మంది తమ కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో రహదారుల్లో వాహనాల రద్దీ నెలకొని కిలో మీటర్ల కొద్దీ విజయవాడ-హైదరాబాద్ హైవేలో ట్రాఫిక్ జామ్ నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates