టీఆర్ఎస్ ను బీజేపీ ట్రాప్ లోకి లాగేసిందా ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. మామూలుగా ఎన్నికలు ఏదైనా ప్రతిపక్షాలకు టీఆర్ఎస్సే అజెండా సెట్ చేస్తుంది. దాని ప్రకారమే మిగిలిన పార్టీలు ఫాలో అయిపోతుంటాయి. కానీ ఇపుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం అజెండాను కమలంపార్టీ సెట్ చేస్తే టీఆర్ఎస్ ఫాలో అయిపోతోంది. ఒకసారి అజెండా సెట్ చేసే అవకాశం బీజేపీకి రాగానే గ్రేటర్ ప్రచారం మొత్తం మతం కోణంలోనే జరిగిపోతోంది. తనకు తెలీకుండానే టీఆర్ఎస్ నేతలకు మతం కోణంలోనే బీజేపీకి కౌంటర్లు ఇవ్వటంతోనే సరిపోతోంది.

గడచిన ఆరు సంవత్సరాల్లో టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేయబోయే అభివృద్ది గురించి కేటీయార్ చెప్పుకోవటానికి సమయం సరిపోవటం లేదు. పాకిస్ధాన్, రోహింగ్యాలు, టెర్రరిస్టులు, ఓల్డ్ సిటి లాంటి అంశాలను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కావాలనే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టి జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ఓ వ్యూహం ప్రకారమే కమలం నేతలు ప్రస్తావిస్తున్నారు. దాంతో బండి ఆరోపణలకు ధీటైన సమాధానం ఇవ్వాలన్న తొందరలో కేటీయార్ కూడా అదే పద్దతిలో మాట్లాడుతున్నారు.

దాంతో గ్రేటర్ ప్రచారమంతా మతం కోణంలోనే సాగిపోతోంది. ఒకవైపు నగరంలో అనేక సమస్యలున్నాయి. సమస్యల పరిష్కారం గురించి ఆలోచించని టీఆర్ఎస్ నేతలు, అభ్యర్ధులు డివిజన్లలో ప్రచారానికి వెళితే స్ధానికులు తరుముకుంటున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కు కూడా ఇటువంటి చేదు అనుభవమే ఎదురవుతోంది. సోదరుడు చాలడన్నట్లుగా తాజాగా అక్బరుద్దీన్ కూడా తోడయ్యారు. అక్బరుద్దీన్ మాట్లాడుతూ పేదల ఇళ్ళు కూల్చేయటం కాదు దమ్ముంటే పీవీ నరసింహారావు, ఎన్టీయార్ సమాదులను కూల్చేయాలంటూ టీఆర్ఎస్ కు సవాలు విసిరారు.

దానికి బండి సంజయ్ సమాధానమిస్తు దమ్ముంటే పీవీ, ఎన్టీయార్ సమాదులను కూల్చి చూడు, దారుసల్లాం భవనాన్ని నిముషాల్లో కూల్చి చూపిస్తామంటూ అక్బర్ కు ప్రతి సవాలు విసిరారు. ఇదే సమయంలో కేటీయార్ కూడా ఎంఎల్ఏ అక్బరుద్దీన్ మాటలను తప్పు పట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకరోజేమో ఓల్డ్ సిటిలో సర్జికల్ స్ట్రైక్స్ , రోహింగ్యాలు, టెర్రరిస్టులతో సరిపోయింది. మరుసటి రోజేమో సమాదుల కూల్చివేతలు, దారుసలాం కూల్చివేతల చుట్టే ప్రచారం అంతా సరిపోయింది.

మొత్తం మీద బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలందరు ఒకళ్ళని మరోకళ్ళు రెచ్చ గొట్టడంలో భాగంగానే వ్యూహాత్మకంగా సున్నితమైన అంశాలను కావాలనే ప్రస్తావిస్తున్న విషయం అర్ధమైపోతోంది. గ్రేటర్ ప్రచార తీరుతెన్నులు చూస్తుంటే ప్రధాన పార్టీల ప్రచార తీరు చూస్తుంటే మాత్రం కట్టుతప్పి వ్యవహరిస్తున్నాయని స్పష్టమైపోతోంది. పైగా ఈ పార్టీలు కావాలనే తమ ప్రకటనలతో జనాలను రెచ్చేగొట్టేట్లుగా వ్యవహరిస్తుంటే మరి ఎన్నికల కమీషన్ ఏమి చేస్తోందన్నదే అర్ధం కావటం లేదు.