టీ కాంగ్రెస్ ఎంపీ కుమార్తె.. జగన్ పార్టీ సీనియర్ నేత కొడుకు పెళ్లి

కాస్త భిన్నమైన కాంబినేషన్. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఈ విషయం ఎప్పటి నుంచో ఉన్నా.. గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పులతో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెళ్లిళ్లు మాజోరుగా సాగేవి. తెలంగాణ ఉద్యమం పీక్స్ కు చేరిన వేళ.. రెండు రాష్ట్రాల మధ్య పెళ్లిళ్ల విషయంలోనూ కాస్త గ్యాప్ వచ్చింది. ప్రముఖులు అయితే.. సంబంధాలు కలుపుకునే విషయంలో ఆలోచించుకునే పరిస్థితి. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న వేళ.. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు ఉండాలన్న విషయాన్ని మర్చిపోతారు. అందుకే.. ఎందుకైనా మంచిదన్నట్లుగా వ్యవహరించేవారు.

విభజన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు కొత్త బంధురికాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ నేతలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పెళ్లివేడుక కూడా అలాంటి ప్రత్యేకత ఉన్నదే. హైప్రొఫైల్ పెళ్లిగా చెప్పే ఈ వివాహానికి కోవిడ్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిమిత సంఖ్యలోనే అతిధులకు ఆహ్వానం పంపారు. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..

భువనగిరి ఎంపీ.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిది రెడ్డికి.. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరుడి కుమారుడి పెళ్లి ఖాయమైంది. వాస్తవానికి ఈ ఆగస్టులోనే వీరి ఎంగేజ్ మెంట్ అయ్యింది. హైటెక్స్ లో జరిగిన ఈ వివాహం వేడుకగా సాగింది. కోవిడ్ కారణంగా హైప్రొఫైల్ పెళ్లిల్లు తక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన పెళ్లి వేడుకను చూస్తే.. ధూంధాంగా జరిగిందనే చెప్పాలి.ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.