ఇటీవల ఓ పత్రిక, మీడియాలో వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతి గురించి సంచలన కథనాలు వెలుగు చూశాయి. ఆమె పార్టీ పగ్గాలను చేపడుతున్నారని.. త్వరలోనే దీనిపై నిర్ణయం రానుందని, ఇప్పటికే నాయకులతో ఆమె టచ్లో ఉన్నారని కూడా ఈ కథనం చెప్పుకొచ్చింది. ఇది వైసీపీలో సంచలనంగా మారింది. సహజంగా రెడ్డి నాయకులు మహిళా సారథ్యంలో పనిచేసేందుకు ఇష్టపడరు. అందుకే.. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుమార్తెను ఇంచార్జ్గా పెట్టినా.. ఆ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది.
ఇక, ఇప్పుడు రాష్ట్రంలో నెంబర్ 2 పార్టీగా ఉన్న వైసీపీకి భారతి కనుక సారథ్యం వహించే పరిస్థితి వస్తే.. ఈ పార్టీ నెంబర్ 3 లేదా 4 స్థాయికి పడిపోయే అవకాశం తప్పకపోవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంతేకాదు.. భారతి పటిమ, ఆమె వాయిస్, వ్యవహరించే తీరుపై కూడా చర్చ జరుగుతోంది. బలమైన వాయిస్ ఉంటే తప్ప.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మనగలగడం సాధ్యం కాదు. పైగా బలమైన టీడీపీని ఢీ కొట్టి ముఖ్యంగా కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేసి.. ప్రజలను ఆకర్షిస్తే.. తప్ప అధికారం దక్కడం అంత ఈజీకాదు.
ఈ పరిణామాలపైనే వైసీపీ నాయకులు కూడా చర్చిస్తున్నారు. ఇక, జగన్ జైలుకు వెళ్తారన్న లెక్కలు ఉన్న నేపథ్యంలో పార్టీ నెక్ట్స్ నేత భారతి కావడం తథ్యమన్న చర్చ కూడా ఎప్పటి నుంచో ఉన్నా.. ఇది సాధ్యం కాదని కొన్నాళ్లుగా నాయకులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు ఓ కీలక పత్రిక వెలుగులోకి తెచ్చిన విషయంతో అందరూ అలెర్ట్ అయ్యారు. ఈ పరిణామాలపై తాజాగా జగన్ స్పందించారు.అయితే.. ఆయన భారతి పేరును నేరుగా చర్చించకుండా.. ‘రాసుకునేటోళ్లను రాసుకోనీయండబ్బా!. మనమేమన్నా.. అడ్డుకుంటామా?’ అని వ్యాఖ్యానించారు.
అంటే.. దీనిని బట్టి.. వైసీపీలో భారతి ఎంట్రీ ఉంటుందా? ఉండదా? అనే విషయంపై జగన్ క్లారిటీ ఇవ్వకపోయినా.. నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. భారతి పగ్గాలు చేపడుతారని కానీ, చేపట్టరని కానీ, ఆయన చెప్పలేదు. ప్రస్తుతం భారతి నిర్వహిస్తున్న వ్యాపారాల నుంచి వస్తున్న సొమ్ములో సింహ భాగం పార్టీకి కేటాయిస్తున్నారన్నది నేతలు చెబుతున్న మాట. ఈ పరిణామాలు ఎలా ఉన్నా.. ప్రస్తుత కథనంపై మాత్రం వైసీపీ లో నాయకులు ఒకలాగా చర్చిస్తుంటే.. జగన్ మాత్రం తనదైన శైలిలోనే ఉన్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates