బాబుపై వ్య‌తిరేకత పెరిగింది.. ఇక‌, మ‌న‌మే: జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అసెంబ్లీకి రాకుండా.. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో పార్టీ నాయ‌కులు, జిల్లాల ఇంచార్జుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఆయ‌న ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. తాజాగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభ‌మైన వైసీపీ నేత‌ల విస్తృత స్థాయి సమావేశం రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు నిర‌వ‌ధికంగా సాగింది. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై జ‌గ‌న్ స్పందించారు. త‌న పార్టీ వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్ర‌భుత్వ ప‌నితీరును ఆయ‌న మూడు కోణాల్లో వివ‌రించారు. ఇక‌, చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌న్న ఆయ‌న ఇప్పుడు వైసీపీ మాత్ర‌మే ఏపీకి ప్ర‌త్యామ్నాయ ని పేర్కొన్నారు. ఆ దిశ‌గా నాయ‌కులు ప‌నిచేస్తే.. త్వ‌ర‌లోనే అధికారం ద‌క్కుతుంద‌ని తెలిపారు.

జ‌గ‌న్ పేర్కొన్న 3 అంశాలు…

సూప‌ర్ సిక్స్‌: గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సూప‌ర్ సిక్స్ హామీలు ఇచ్చార‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే.. వీటిలో ఏదీ కూడా అమ‌లు కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ముఖ్యంగా త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్నికొంద‌రికే ఇచ్చార‌ని.. మెజారిటీ త‌ల్లుల‌కు అన్యాయం చేశార‌ని అన్నారు. రూ.15000 ఇవ్వాల్సి ఉండ‌గా.. రూ.9000 వేలు, రూ.8000 చొప్పునే ల‌క్షల మందికి ఇచ్చిన‌ట్టు మంత్రి లోకేషే అసెంబ్లీలో ఒప్పుకొన్నార‌ని గుర్తు చేశారు. ఇక‌, ఆడ‌బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదన్నారు. రైతులకు ఇస్తామ‌న్న అన్న‌దాత సుఖీభ‌వ‌లో ఏడాదిన్న‌ర కాలానికి రూ.30 వేల చొప్పున అందించాల్సి ఉండ‌గా రూ.5 వేలు మాత్ర‌మే ఇచ్చార‌ని తెలిపారు. వీటిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని జ‌గ‌న్ సూచించారు.

శాంతి భ‌ద్ర‌త‌లు: రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అత్యంత దారుణంగా ఉన్నాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు ఎవ‌రికీ స్వేచ్ఛ లేకుండా పోయింద‌న్నారు. మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, దాడులు జ‌రుగుతున్నా.. ఎవ‌రూ స్పందించ‌డం లేద‌ని తెలిపారు. త‌మ హ‌యాంలో దిశ యాప్ ద్వారా కేవ‌లం 10 నిమిషాల్లో నిందితుల‌ను అదుపులోకి తీసుకుని.. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించామ‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు ఎవ‌రూ స్పందించ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. హోం మంత్రి.. అనిత సొంత జిల్లాలోనే చిన్నారిపై దారుణం జ‌రిగితే ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. ఇక‌, సోష‌ల్ మీడియాలో ఏ చిన్న పోస్టు పెట్టినా కేసులు పెడుతున్నార‌ని.. కోర్టులు వ‌ద్ద‌ని చెబుతున్నా.. తిట్టిపోస్తున్నా.. తీరు మార‌డం లేద‌ని అన్నారు.

రైతులు-ప్రైవేటీక‌ర‌ణ‌: రైతుల‌కు ఈ ప్ర‌భుత్వం ఏ పంట‌కూ గిట్టుబాట ధ‌ర‌లుల‌భించ‌డం లేద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఉల్లిపాయలు, ట‌మాటాలు, పొగాకు, మామిడి రైతులు ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం యూరియా కొర‌త అన్న‌దాత‌కు మ‌రింత ఇబ్బందిగా మారింద‌ని చెప్పారు. వైసీపీ నాయ‌కులు.. ఈ విష‌యాల‌ను వివ‌రిస్తే.. ప్ర‌భుత్వం ఓర్చుకోలేక పోతోంద‌ని.. ప్ర‌తిగా రైతుల‌పైనే కేసులు పెడ‌తామ‌ని హెచ్చరించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని సూచించారు. ఇక‌, ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం త‌మ హ‌యాంలో మెడిక‌ల్ కాలేజీలు తీసుకువ‌చ్చామ‌న్న జ‌గ‌న్‌.. వాటిని ఇప్పుడు పీపీపీకి ఇస్తూ.. అడ్డ‌గోలు వాద‌న‌లు చేస్తున్నార‌ని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏదేమైనా చంద్ర‌బాబు స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌ని.. వైసీపీపై న‌మ్మ‌కంతో ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు.