విశాఖపట్నంలో ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన స్టీల్ ప్లాంటును తమ రాజకీయ విన్యాసాలకు.. ఆటలకు వైసీపీ నాయకులు వేదికగా చేసుకున్నారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీ శాసన మండలిలో మంగళవారం సాయంత్రం.. వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి.. విశాఖ పట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నారా? లేక నిలుపుదల చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం దీనిని నిలుపుదల చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగులు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలంగా నోటిఫికేష్లన్లు జారీ చేసిందన్నారు.
దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంటు ఎక్కడికీ పోదన్నారు. దీనిని ప్రైవేటీకరించకుండా నిలుపుదల చేసేందుకు కూటమి ప్రయత్నం ఇప్పటికే ప్రయత్నాలు చేసిందన్నారు. దీంతో ప్రైవేటీకరణ అనేది లేకుండా పోయిందని తెలిపారు. అయితే.. వైసీపీకి మాత్రం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలన్న ఉద్దేశం ఉందని విమర్శించారు. దీనిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు.. విశాఖ ప్లాంటు ప్రైవేటీకరణ జరగబోదని.. ఇప్పటికే అనేక సార్లు చెప్పామన్నారు. ఈ విషయంలో తమను బుల్డోజ్ చేసి.. వ్యతిరేక ప్రచారంతో లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగారు.
“మా వాదనలో ఎలాంటి పొరపాటులేదు. కానీ, మీరే పలు రకాలుగా విశాఖ స్టీల్ ప్లాంటుపై రాజకీయాలు చేస్తున్నారు. మీ హయాంలోనే దీనిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు మౌనంగా ఉన్నారు. కనీసం.. ఉ ద్యోగులను కూడా పరామర్శించలేదు. కానీ, ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిని రాజకీయం చేసి వివాదాలకు దిగాలని.. చూస్తున్నారు. ఎప్పటికీ మీకు ఆ అవకాశం ఇవ్వం. విశాఖ స్టీలు ప్లాంటును ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటుపరం కాకుండా చూసుకుంటాం.“ అని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు.
ఏపీ విషయంలో కేంద్రం కూడా క్లారిటీతోనే ఉందని లోకేష్ చెప్పారు. కేంద్రం ఏం చేసినా.. ఏపీని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతోందన్నారు. “ప్రైవేటీకరణ జరగాలని వైకాపా కోరుకుంటున్నట్లుంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు. మీ ఆశలు నెరవేరవు. మా కూటమికి దీనిపై క్లారిటీ ఉంది. వైసీపీకే లేదు“ అని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates