మండ‌లిలో మంట‌లు: బొత్స వ‌ర్సెస్ లోకేష్!

ఏపీ శాస‌న మండ‌లిలో మాట‌ల మంట‌లు రేగాయి. అధికార‌, విపక్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. వాస్త‌వానికి అసెంబ్లీకి రాక‌పోయినా.. వైసీపీ త‌న బ‌లం ఎక్కువ‌గా ఉన్న మండ‌లికి మాత్రం వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మంగ‌ళ‌వారం మండ‌లిలో విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు.. మంత్రి నారా లోకేష్‌కు మ‌ధ్య మాట‌ల మంట‌లు రేగాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై కొన్నాళ్లుగా ప్ర‌శ్న‌లు సంధిస్తున్న వైసీపీ తాజాగా మండ‌లిని దీనికి వేదిక చేసుకుంది.

తొలుత బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు చేయాల్సిన ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు అయినా.. లేద‌ని బొత్స వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు సొమ్ముల‌ను కూడా ఇత‌ర ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్నార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌తో బొత్స వాగ్వాదానికి దిగారు. బడ్జ‌ట్‌లో నిధులు కేటాయించ‌లేద‌న్న బొత్స వ్యాఖ్య‌ల‌ను ప‌య్యావుల ఖండించారు.

అనంత‌రం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. బొత్స చేసిన విమ‌ర్శ‌లను వెన‌క్కి తీసుకోవాల‌ని, లేదా రికార్డుల నుంచి తొల‌గించాల‌ని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎప్పుడు కావాలంటే అప్పుడు చ‌ర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. ఏ విష‌యంపైనా చ‌ర్చించేందుకు తాము రెడీ అంటూ.. వైసీపీ స‌భ్యుల‌కు స‌వాల్ రువ్వారు. వైసీపీ హ‌యాంలోనే విద్యార్థుల‌కు స‌రిగా ఫీజు రీయింబ ర్స్‌మెంటు చేయ‌లేద‌ని లోకేష్ వ్యాఖ్యానించారు.

“మీరు త‌ప్పులు చేసి.. మాపై నింద‌లు మోపుతున్నారా?“ అంటూ నారా లోకేష్ ప్ర‌శ్నించారు. వైసీపీ హ‌యాంలో ఎవ‌రెవ‌రికి ఎంత మేర‌కు బ‌కాయి పెట్టారో అంద‌రికీ తెలుసున‌ని..అవ‌స‌రం అయితే గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని తెలిపారు. సభలో తాను పరుషంగా మాట్లాడాన‌ని చెబుతున్న బొత్స చెబుతున్నా.. దీనికి ఆధారాల‌ను చూపించాల‌ని అన్నారు. తాను ఎప్పుడూ ఎవ‌రినీ దూషించ‌లేద‌ని నారా లోకేష్ తెలిపారు. బొత్స సీనియ‌ర్ నాయ‌కుడ‌ని, తాను ఎప్పుడూ గౌర‌విస్తాన‌ని మంత్రి చెప్పారు.