తాజాగా దేశంలో జిఎస్టి 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా జిఎస్టి స్లాబులు తగ్గి కొత్త విధానాలు అమలవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, చిన్నచిన్న వ్యాపారులకు కూడా మేలు జరుగుతుంది అనేది జీఎస్టీ సంస్కరణల లక్ష్యం. అయితే పన్ను ఆదాయం పై ఆధారపడిన రాష్ట్రాలు ఈ సంస్కరణల విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అలాగని పైకి చెప్పలేక ఇబ్బంది కూడా పడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలకు సాధారణంగా ప్రధాన ఆదాయం పన్నులే. మరీ ముఖ్యంగా వాణిజ్య పనులు… రాష్ట్ర ప్రభుత్వాలకు బలమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఈ ఆదాయంపైనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని జిఎస్టి స్లాబులను మార్చింది. ఇది ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం కీలక ఇబ్బందిగా మారింది. దీనివల్ల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో మరిన్ని ఇబ్బందులు పడక తప్పదు. ఒక వైపు జనాభా పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వాలకు రావలసిన ఆదాయం తగ్గుతోంది.
దీని నుంచి బయట పడలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తుతోంది. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీలో సూపర్ సిక్స్ ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయం మరింత పెంచుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే, ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే ఆదాయాలను గమనిస్తే జిఎస్టి పన్నులు రాష్ట్రానికి కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ పన్నులలోనే తగ్గుదల నమోదు అయితే భవిష్యత్తులో ప్రభుత్వాన్ని నడిపించడం… ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తీసుకు వస్తాయి అనడంలో సందేహం లేదు.
తాజాగా కాగ్ ఇచ్చిన నివేదికలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కళ్ళకు కడుతున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో రాష్ట్రాలు కూరుకుపోయాయని, వేతనాలు, పింఛన్లు ఇచ్చేందుకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పథకాలు ఎక్కువగా అమలవుతున్న క్రమంలో ప్రభుత్వాలకు ఆదాయం తగ్గి ఇబ్బంది పడుతున్నట్టుగా స్పష్టం చేసింది. గోరుచుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా ఇప్పుడు జీఎస్టీ ఆదాయం కూడా తగ్గిపోవడంతో చంద్రబాబు ముందు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి.
పైకి జీఎస్టీ ని ప్రశంసిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం దీనివల్ల ఎదురయ్యే ప్రభావాలు… రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గే ఆదాయం, ఇదే సమయంలో పెరుగుతున్న సంక్షేమ పథకాలు వంటి వాటిపై చర్చలు చేస్తున్నారు. వీటిని అధిగమించాలి అంటే అప్పులైనా చేయాలి, లేదా సంపద సృష్టేనా జరగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపద సృష్టికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, సంక్షేమ పథకాలు ఆపే అవకాశం అయితే లేదు. సో మొత్తానికి సీఎం చంద్రబాబు విజన్ కు జీఎస్టీ తగ్గింపు వ్యవహారం పెద్ద పరీక్షగా మారింది అనేది వాస్తవం. మరి దీనిని ఆయన ఏ విధంగా అధిగమిస్తారు అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates