వైసీపీలో నేతలు కట్టు దాటుతున్నారా ?

పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రోడ్డున పడుతున్న విభేదాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ప్రజా ప్రతినిధులందరూ క్రమశిక్షణతోనే ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారిలోని వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీలోని నేతల మధ్య అంతర్గతంగా ఉన్న గొడవలు ఇప్పుడిప్పుడే బయటపుడుతున్నాయి. ఆమధ్య వైజాగ్ లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన గొడవను మరచిపోకముందే తాజాగా కాకినాడలో పెద్ద గొడవైంది. మధ్యలో కూడా కడప, కర్నూలులో కూడా గొడవలయ్యాయి.

నిజానికి పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నది రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికే అన్న విషయం అందరికీ తెలిసిందే. విజయసాయితో మాట్లాడుతున్నపుడు జగన్ తో మాట్లాడుతున్నట్లుగానే నేతలు భయ, భక్తులతో ఉంటారు. అలాంటిది డీఆర్సీ సమావేశంలో ఏకంగా ఎంపితోనే అదీ బహిరంగంగా ఎంఎల్ఏలు వాదనకు దిగారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములను రాజకీయ నేతలు కబ్జాలు చేస్తున్నారనే పాయింట్ మీద ఇటు విజయసాయికి అటు ఎంఎల్ఏలు కరణం ధర్మశ్రీ, అమరనాధ్ కు మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది.

కడపలో పార్టీ నేతల మధ్య జరిగిన గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే జగన్ సొంత జిల్లా అయ్యుండి ఆధిపత్యం కోసం నేతలు బహిరంగంగానే గొడవలు దిగటమే ఆశ్చర్యమేసింది. కర్నూలులోని నందికొట్కూరు ఎంఎల్ఏ ఆర్ధర్ కు నియోజకవర్గంలో కీలక నేతకు పడటం లేదు. నియోజకవర్గంలో ఎవరిది పై చేయనే విషయంలో ఇన్చార్జి మంత్రి ముందే ఇద్దరు పెద్దగా వాదులుకోవటం అందరు చూసిందే.

తాజాగా కాకినాడలో రాజ్యసభ ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్-కాకినాడ ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి మధ్య పెద్ద గొడవే అయ్యింది. ఇక్కడ టిడ్కో ఇళ్ళల్లో అవినీతి జరిగిందన్న ఎంపి ఆరోపణలపై ప్రతిపక్ష ఎంఎల్ఏలు కాకుండా అధికారపార్టీ ఎంఎల్ఏ స్పందించటమే విచిత్రంగా ఉంది. అవినీతి ఆరోపణలు చేసేముందు తమతో చర్చించాలని, అవినీతికి పాల్పడిందో ఎవరో చెప్పాలంటూ ద్వారపూడి ఎంపితో పెద్ద వాదనకు దిగారు. దాంతో మిగిలిన వాళ్ళు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సొచ్చింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జిల్లాలోని మంత్రులు-ఎంపిలు-ఎంఎల్ఏల మధ్య సమన్వయం లేని విషయం బయపడిపోతోంది. దీనికితోడు పెరిగిపోతున్న ఆధిపత్య సమస్య వల్ల బహిరంగంగానే గొడవలు పడుతున్నారు. ఎక్కడైనా అధికార-ప్రతిపక్ష నేతల మధ్య గొడవలు జరగటం సహజం. కానీ ఇక్కడ అధికారపార్టీ నేతల మధ్యే గొడవలు జరుగుతున్నాయి. అంటే ప్రజా ప్రతినిధులు కావచ్చు నేతలూ కావచ్చు మొత్తానికి కట్టు తప్పిపోతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ గొడవలన్నీ జగన్ దృష్టికి వెళుతున్నాయో లేదో తెలీదు. వైజాగ్ లో జరిగిన గొడవ తర్వాత ఎంఎల్ఏలను పిలిపించుకుని జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం. మరి కాకినాడలో జరిగిన గొడవపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.