ఏపీ అసెంబ్లీ: వారు రారు.. వీరూ లేరు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వర్షాకాల సమావేశాల్లో కీలకమైన నాలుగు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో సభకు అందరూ రావాలని పదేపదే స్పీకర్ అయ్య‌న్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా అధికారులు కూడా ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. వైసిపి ఎలాగూ రావడం లేదు. కాబట్టి ఆ పార్టీ నాయకులను ఆ పార్టీ అధినేతను కూడా పదేపదే చంద్రబాబునాయుడు పిలిచారు. అది సవాల్ రూపంలో కావచ్చు రాజకీయ రూపంలో కావచ్చు.

ఏదేమైనా సభకు రావాలని చర్చలలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఇక స్పీకర్ కూడా సభకు రాకపోవడం సరికాదన్నది ఆది నుంచి చెబుతున్న మాట. అయినప్పటికీ వైసీపీ నాయకులు రాలేదు. సరే ఈ విషయం పక్కన పెడితే.. మరి సొంత పార్టీ నాయకుల మాట ఏంటి? కూటమి ఎమ్మెల్యేలే 164 మంది ఉన్నారు. అంటే సభ మొత్తం నిండిపోవాలి. కేవలం 11 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండాలి. అంతే కదా జరగాల్సింది. కానీ, చిత్రం ఏంటంటే సభలో కనీసం 40 మంది కూడా లేకపోవడం పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ స్పీకర్ అయ్య‌న్న‌ పాత్రుడు అసహనంతో చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

“40 మంది కూడా లేకపోతే ఎట్లా“ అని ఆయన తొలి వాక్యంలోనే చెప్పటం విశేషం. మరి అంత బిజీగా ఉన్నారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే సభకు రావడం లేదా అనేది తేలాల్సి ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని, నిధులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీనిపై పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబుకు కూడా లేఖ రాసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కు సైతం వారు విన్నవించారు. బహుశా ఈ కారణంతో వారు సభకు రాకుండా డుమ్మా కొట్టారా అనేది చ‌ర్చ‌.

లేకపోతే తొలి రోజు ఏమంటుందిలే సభలో అని భావించారా అనేది చూడాలి. ఏదేమైనా తొలి రోజే అధికార పార్టీకి చెందిన 164 మంది ఎమ్మెల్యేలలో కేవలం 40 నుంచి 42 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారని స్పీకర్ చెప్పడమే చాలా విచిత్రంగా.. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి సూచనలు చేస్తారు.. ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఆయన సభ నాయకుడు కాబట్టి.. ఆయన తీసుకునే నిర్ణయానికి సభ్యులు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది.