మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ రోజాపై జనసేననేత, మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్లో తైతక్కలాడే రోజా కూడా పవన్ను విమర్శించడమా? అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమెకు పవన్ను విమర్శించే స్థాయి లేదన్నారు. పవన్.. ఆమెలాగా అవినీతి అక్రమాలు చేయలేదన్నారు. భూముల కబ్జాలు కూడా చేయలేదని.. దొంగ చాటు వ్యాపారాలు కూడా లేవని మంత్రి వ్యాఖ్యానించారు. “రోజా గురించి.. తిరుపతి, నగరిలో అడిగితే దారుణాలు ఎలా ఉన్నాయో చెబుతారు” అని మంత్రి అన్నారు. అలాంటి రోజా పవన్పై విమర్శలు చేయడం ఏంటన్నారు.
రాష్ట్రంలో వైసీపీ హయాంలో తీసుకువచ్చిన వైద్య విద్యా కళాశాలలను పీపీపీ(ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యం) విధానంలో అప్పగించే విషయంపై ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రోజా స్పందిస్తూ.. ఇంత జరుగుతున్నా.. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. దానిలో ఆయనకు ముడుపులు ముడుతున్నాయన్న కోణంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా దుర్గేష్ స్పందించారు. రోజాకు తమ నేతను విమర్శించే హక్కులేదన్నారు. ఆమె చేసిన అక్రమాలు.. అన్యాయాలు అందరికీ తెలిసివేనని విమర్శించారు.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. నష్టపోయారే.. తప్ప, రూపాయి కూడా సంపాయించుకోలేదని మంత్రి చెప్పారు. ఎంతో మందికి తన సొంత నిధులు ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. ఆయన రోజు వారీ సమయంలో 90 శాతం ప్రజల కోసం వెచ్చిస్తున్నారని.. 10 శాతం మాత్రమే సినిమాలపై దృష్టి పెడుతున్నారని తెలిపారు. ఇక, పీపీపీ విధానం సరైందేనని దుర్గేష్ చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పీపీపీ విధానం ప్రభుత్వాలకు భారం తగ్గిస్తోంద ని చెప్పారు. ప్రవేటుకు ఇచ్చినప్పటికీ.. పూర్తి అజమాయిషీ, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉంటాయని.. తద్వారా.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
పీపీ విధానం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను నిర్మించి.. వాటిని పేదలకుచేరువ చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. కొందరికి పనిలేకుండా పోయిందని.. అందుకే.. ఇలా ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా విమర్శిస్తున్నారని దుర్గేష్ పరోక్షంగా వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates