ఏపీలో కొత్త జిల్లాలు.. స‌రికొత్త సంగ‌తులు..!

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను మార్పు చేసే దిశ‌గా స‌ర్కారు అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ నేతృత్వంలో స‌ర్కారు క‌మిటీని ఫామ్ చేసింది. ఈ క‌మిటీ కార్య‌క్ర‌మాలు కొంత మేర‌కు నెమ్మ‌దిగా సాగుతున్నాయి. అయితే.. వ‌చ్చే డిసెంబ‌రు 31 నాటికి పూర్తి చేయాల‌న్న డెడ్‌లైన్ ఉండ‌డంతో తాజాగా దీనిపై మ‌రోసారి దృష్టి పెట్టారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు, సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్ స‌భ వంటివి కొన‌సాగాయి. దీంతో మంత్రుల‌కు జిల్లాల‌పై దృష్టి పెట్టే అవ‌కాశం లేకుండా పోయింది.

ఇక, ఇప్పుడు వ‌చ్చే వారం రోజుల పాటు మంత్రులు జిల్లాల ఏర్పాటు, మార్పు, కూర్పుల‌పై దృష్టి పెట్టాల‌ని.. సీఎం చంద్ర‌బాబు నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీంతో మంత్రులు మ‌ళ్లీ.. ప‌ని ప్రారంభించారు. ఈ క్ర‌మంలో తాజాగా చింతూరు జిల్లాను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదిస్తున్న‌ట్టు తెలిసింది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు సుదీర్ఘ దూరంలో ఉంది. సుమారు మూడు గంట‌ల పాటు ప్ర‌యాణిస్తే త‌ప్ప‌.. వెళ్లే ప‌రిస్థితి లేదు. ఈ విష‌యాన్ని అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు చెప్ప‌డంతో ప్ర‌త్యేకంగా జిల్లా ఏర్పాటుకు రంగం రెడీ అవుతోంది.

దీని ప్ర‌కారం.. రంపచోడవరం డివిజన్‌తో పాటు చింతూరు డివిజన్‌లోని 4 విలీన మండలాలు కలిపి.. చింతూరు లేదా.. రంప‌చోడ‌వ‌రం పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి.. ‘మార్కాపురం’ జిల్లా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ జిల్లాలో గిద్దలూ రు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు ఉండ‌నున్నాయి. వాస్త‌వానికి గ‌తంలోనే మార్కాపురం ప్ర‌త్యేక జిల్లా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఉన్నా.. వైసీపీ స‌ర్కారు ప‌ట్టించుకోలేద‌న్న విష‌యం తెలిసిందే.

ఇక‌, అద్దంకి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌కాశం జిల్లాలో విలీనం చేయ‌నున్నారు. త‌ద్వారా.. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడుతో కలిపి మొత్తం ఐదు నియోజకవర్గాలతో ప్ర‌కాశం జిల్లా ఏర్ప‌డుతుంది. ఇదిలావుంటే.. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌త్యేక జిల్లాగా మార్చాల‌ని నిర్ణ‌యించారు. అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్‌ జిల్లా ఏర్పాటు చేస్తారు. దీనిలో రాజధాని పరిధిలోని 29 గ్రామాలు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలు వస్తాయి. అదేవిధంగా పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు కూడా ఈ ‘అమ‌రావ‌తి జిల్లా’లో క‌ల‌ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓ ప‌ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంద‌ని అధికారులు చెబుతున్నారు.