మంచి టైమింగ్.. లోకేష్ గ్రాఫ్ పైపైకి..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ మంత్రి నారా లోకేష్ సరైన సమయంలో సరైన విధంగా స్పందించారు. దీంతో ఆయన పేరు ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో పతాక శీర్షిక అయింది.

నేపాల్‌లో సంభవించిన అల్లర్ల కారణంగా అక్కడ తెలుగు వారు చిక్కుకుపోయారు. ఒక్క తెలుగు వారే కాదు, దేశం నుంచి నేపాల్ పర్యటనకు వెళ్లిన చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి దీనిపై అధికారులకు బాధ్యతలు అప్పగించి నారా లోకేష్ బుధవారం జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమానికి వెళ్లిపోవచ్చు.

కానీ ఇక్కడే చంద్రబాబు పెద్ద వ్యూహం రెడీ చేసుకున్నారు. జాతీయ స్థాయిలో నారా లోకేష్‌ను ఎలివేట్ చేస్తున్న ఆయన, సరైన సమయంలో ఆయన పనితీరు రూపంలో ఎలివేట్ అయ్యేలా చేశారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు చేపట్టిన కార్యక్రమం బాధ్యతలను ఆయనపైనే పెట్టారు. స్వయంగా తీసుకునే అవకాశం ఉన్నా, ఇది రాష్ట్రాన్నే కాకుండా జాతీయ స్థాయిలోనూ చర్చకు వచ్చిన అంశం కావడంతో ఈ ఛాన్స్‌ను నారా లోకేష్‌కు ఇస్తే ఆయన ఎలివేషన్ బాగుంటుందన్న అంచనాకు వచ్చారు.

చంద్రబాబు సూచనలతో అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే రోజంతా గడిపిన నారా లోకేష్, నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారితో ముఖాముఖి ఆన్‌లైన్‌లో చర్చించారు. వారికి భరోసా కల్పించారు. వారి బాధలు తెలుసుకున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇలా ఒకరోజులో కీలక కార్యక్రమానికి మిస్సయినా, అదే సమయంలో అంతకుమించిన కీలక బాధ్యతను భుజాన వేసుకోవడం ద్వారా నారా లోకేష్ పేరు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ వినిపించింది.

ప్రస్తుతం దేశం మొత్తం నేపాల్ పరిణామాలపైనే దృష్టి పెట్టింది. ముఖ్యంగా తమ వారు అక్కడ చిక్కుకోవడంతో వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను అందరూ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బాధ్యతను అధికారులకు వదిలేసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మంత్రి నారా లోకేష్ స్వయంగా ఈ బాధ్యతలు తీసుకుని తెలుగు వారికి భరోసా ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన హైలైట్ అయ్యారు. సహజంగానే ఆయన గ్రాఫ్ కూడా జోరందుకుని పైపైకి ఎగబాకిందని అంటున్నారు పార్టీ నాయకులు.