త్రిశంకు స్వ‌ర్గంలో వైసీపీ.. 15 నెల‌లు.. వ‌రుస షాకులు…?

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసిపి వ్యవహారం త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది. గడిచిన 15 నెలలుగా ఈ పార్టీ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే కేవలం సోషల్ మీడియాకు పరిమితమైనట్టు స్పష్టమవుతుంది. వాస్తవానికి అధికారం కోల్పోయినంత మాత్రాన జన ఆదరణ కోల్పోతారని ఎవరు ఊహించరు. ఇది వైసీపీ విషయంలోనూ జరిగే అంశమే. కానీ, ఈ విషయాన్ని గుర్తించడంలో వైసిపి నేతలు ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ వెనకబడ్డారనేది స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో వైసిపి గురించిన ప్రస్తావన వస్తే.. గత ఐదేళ్ల పాలనను ప్రధానంగా ప్రస్తావిస్తూ తప్పులనే ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

వాస్తవానికి ప్రభుత్వం అన్నాక కొన్ని పొరపాట్లు ఉంటాయి. కొన్ని మేళ్లు కూడా ఉంటాయి. ఎవరైనా ప్రత్య‌ర్థులు ఇతర పార్టీల్లోని తప్పులను వెతికినంత తేలికగా మంచిని ఎవరూ వెతకరు. ఈ విషయాన్ని ఆ పార్టీనే చెప్పుకోవాలి. కానీ ఈ విషయంలో వైసీపీ చాలా చాలా వెనకబడిందన్న చర్చ జరుగుతోంది. ఇక గడిచిన 15 మాసాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని సమీక్షించుకోవలసిన అవసరం వైసీపీ అధినేతకు ఎంతైనా ఉంది. ఒక ఓటమి ద్వారా పార్టీ ఎత్తివేయటం ఉండదు. పార్టీ నాయకులు డీలా పడడం అనేది కూడా ఉండదు. కానీ అలాంటి పరిస్థితులను తీసుకువచ్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారనేది స్పష్టంగా వినిపిస్తున్న మాట.

ప్రజల్లోకి రాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అదేవిధంగా ప్రజా సమస్యలపై బలమైన గళం వినిపించేందుకు కూడా ముందుకు రాకపోవడం మరో ప్రధాన ఇబ్బందికర పరిస్తితిని తీసుకువస్తుంది. 15 నెలల కాలంలో అసెంబ్లీకి వెళ్లకపోవడంతో పాటు పార్టీ తరపున జరిగే కీలక కార్యక్రమాలకు కూడా జగన్ దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి ప్రజల్లోకి రాకపోయినా పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలకు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ నాయకులు చెప్పే విషయాన్ని ఇప్పటికీ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.

ముఖ్యంగా మూడు అంశాలకు సంబంధించి జగన్ లో మార్పు రావాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

1) నాయకులు చెప్పింది వినడం: గత ఎన్నికల అనంతరం అనేకమంది నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొంతమంది పార్టీ నుంచి బయటకు కూడా వెళ్లిపోయారు. వీరందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి పార్టీలో లోపాలను తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేయాలి.

2) కార్యకర్తలకు చెరువ: జ‌గ‌న్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు చేరువ‌ కావాల్సిన అవసరం ఉంది. గతంలో వ‌లంటీర్ల‌ను నమ్ముకున్నారు అనే మాట జోరుగా వినిపించిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల సమయానికి కార్యకర్తలను బలోపేతం చేస్తామని, కార్యకర్తలు చెప్పినట్టు వింటామని జగన్ చెప్పుకొచ్చారు. కానీ కార్యాచరణలో మాత్రం అది ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికీ కార్యకర్తలు దూరంగానే వ్యవహరిస్తున్నారు.

3) జనంలోకి రావడం: సమస్యలు ఉంటేనే జనంలోకి రావాల్సిన అవసరం లేదు. కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని లేదా ఒక అంశాన్ని సృష్టించుకుని ప్రజల్లోకి రావడం అనేది నాయకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం.

గతంలో చంద్రబాబు కార్యక్రమాలను సృష్టించుకుని ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది, వైసిపి ప్రభుత్వం ఏర్పడిన ఆరు మాసాలకే ఆయన జనంలోకి వచ్చారు. తర్వాత కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలను ఎక్కడా వదిలేయకుండా ఏదో ఒక కార్యక్రమం రూపంలో ప్రజలకు చేరువ అవుతూనే ఉన్నారు. ఈ తరహా పరిస్థితి జగన్‌లో రావలసిన అవసరం ఉంది. ఏదో ఒక కార్యక్రమం రూపంలో నెలకు ఒకసారైనా ఆయన ప్రజల మధ్యకు వస్తే భవిష్యత్తులో ఆయనకు కాస్త మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులే చెబుతున్నారు.

పార్టీలో ప్రస్తుతం ఉన్న ఇన్చార్జిలు.. ముఖ్యంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నాయకులను మార్చాల్సిన అవసరం ఉందని నేతలే చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ లేనివారు, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వారిని తీసుకువచ్చి వారి కింద పనిచేయాలని ఎంపీలను ఎమ్మెల్యేలను ఆదేశించడం ద్వారా ఆత్మ న్యూనత భావం పెరిగిపోతోంది. ఇది పార్టీకి మేలు చేసే పరిణామం కాదు. ఇప్పటివరకు జరిగింది ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ పరిణామాలను మార్చుకుంటే వైసిపి కొంత మెరుగైన ఫలితాన్ని సాధించే దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఏర్పడుతుందనేది పరిశీలకులు చెబుతున్న మాట.

ఏది ఏమైనా ఈ 15 మాసాల కాలంలో జగన్ సాధించింది ఏమీ లేకపోగా కేసుల్లో ఇరుక్కున్న వారిని మాత్రమే ఆయన పరామర్శిస్తున్నారు అన్న వాదన వినిపించడం గ‌మ‌నార్హం. ప్రజలను విస్మరించారన్న బలమైన మాట బయటకు రావడం విశేషం. దీనిని తగ్గించుకుని ప్రజల కోసం జగన్ ఉన్నారన్న వాదనను బలపడేలాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.