అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ సిక్స్ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసకర పాలన మొదలుబెట్టారని, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టివేసిందనిఅన్నారు. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను తరిమేశారని, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లేలా ఇబ్బందిపెట్టారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం 93 పథకాలను నిలిపివేసిందని, అందుకే, పేద, మధ్యతరగతి జీవితాలలో మార్పు తెచ్చేందుకు సూపర్ సిక్స్ హామీ ఇచ్చామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. 2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని గుర్తు చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు కూటమికి ఇచ్చి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ప్రజలను ప్రశంసించారు.
ఈ సభ రాజకీయాల కోసం, ఓట్ల కోసం కాదని.. ఇచ్చిన మాట నిలబెట్టున్నామని చెప్పేందుకే ఈ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సూపర్ సిక్స్ ను అవహేళన చేశారని, పింఛన్ల పెంపు అసాధ్యమని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని , మెగా డీఎస్సీ సాధ్యం కాదని విష ప్రచారం చేశారని, దీపం వెలగదు… ఫ్రీ బస్సు కదలదు అని వైసీపీ నేతలు ప్రచారం చేశారని చెప్పారు. అయితే, కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని, అందుకే సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభ ఏర్పాటు చేశామని చెప్పారు.
15 నెలల పాలనలో సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు అనంతపురానికి వచ్చామని, తమ ప్రభుత్వానికి అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీ శక్తులకు, యువకిషోరాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, నేపాల్ లో ఆందోళనలు జరుగుతున్నాయని, అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు తెచ్చేందుకు మంత్రి లోకేశ్కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates