రాధాకృష్ణ‌న్‌కు `జై కొట్టిన` విపక్ష ఎంపీలు ఎవరు?

తాజాగా ముగిసిన దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి చెందిన కొంద‌రు ఎంపీలు కూడా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి(విజ‌యం ద‌క్కించుకున్నారు) రాధాకృష్ణ‌న్‌కే జై కొట్టారు. వాస్త‌వానికి ఆది నుంచి `రాజ్యాంగం వ‌ర్సెస్ ఆర్ ఎస్ ఎస్` వాదానికి జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా కాంగ్రెస్ పార్టీ దీనిని ప్ర‌చారం చేసింది. అంతేకాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా ప్ర‌చారం చేశారు. ఇండియా కూట‌మి నుంచి జ‌స్టిస్ బీ. సుద‌ర్శ‌న్ రెడ్డిని ఏక‌గ్రీవంగా కూడా ఎంపిక చేశారు. దీంతో అటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్‌కు.. ఇటు ఇండీ కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి మ‌ధ్య స్వ‌ల్ప వ్య‌త్యాస‌మే ఉంటుంద‌ని.. హోరా హోరీ పోరు ఖాయ‌మ‌ని అనుకున్నారు.

నిజానికి ఈ ఎన్నిక‌ను ఆస్థాయికి చేర్చిన మాట వాస్త‌వ‌మే. దీంతో ఎన్డీయే కూట‌మి సందిగ్ధంలో ప‌డింది. ఏం జ‌రుగుతుందో? అనే ఉద్దేశంతోనూ ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య కొంత చ‌ర్చ‌సాగింది. అయితే.. ఈ వ్య‌వ‌హారాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు చాలా చ‌క్క‌గా వ్య‌వ‌హారాన్ని న‌డిపించారు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం కేంద్రంలోని బీజేపీ బ‌లం లేదు. మిత్ర‌ప‌క్షాల బ‌లంతోనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక చూస్తే.. రాజ‌కీయాల‌కు అతీతం. దీంతో ఏం జ‌రుగుతుందోన‌ని అనుకున్నారు. కానీ, చివ‌రి నిముషంలో జోక్యం చేసుకున్న పెద్ద‌లు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మిలోనే చీలిక‌లు తీసుకువ‌చ్చారు.

ఫ‌లితంగా.. బీఆర్ఎస్‌, బీజేడీ(ఒడిశా ప్ర‌ధాన ప్ర‌తిపక్షం), అకాలీద‌ళ్‌(పంజాబ్‌) ఎంపీల‌ను దూరం పెట్టేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. కార‌ణాలు ఏవైనా ఆయా పార్టీల స‌భ్యులు ఈ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. ఇది ఎన్డీయే కూట‌మికి క‌లిసి వ‌చ్చింది. దీనికితోడు.. సుమారు 14 మంది ఇండియా కూట‌మి ఎంపీల‌ను కూడా కేంద్రం పెద్ద‌లు మ‌చ్చిక చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఫ‌లితంగా వాస్త‌వ ఫ‌లితం తారుమారైంది. ఎలా అంటే.. ఇండియా కూట‌మిలో ఉన్న పార్టీల మొత్తం సంఖ్యాబ‌లం 314 మంది. ఎన్డీయే బ‌లం 438 మంది. కానీ, తుది ఫ‌లితంలో మాత్రం.. ఇది తారుమారైంది.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి అభ్య‌ర్థి సుద‌ర్శ‌న్ రెడ్డికి కేవ‌లం 300 ఓట్లు రాగా.. ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్‌కు ఏకంగా 452 ఓట్లు వ‌చ్చాయి. అంటే.. ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలు కాని వారు.. మాత్ర‌మే కాదు.. ఇండియా కూట‌మిలో ఉన్న పార్టీల‌కు చెందిన ఎంపీలు కూడా బీజేపీ అభ్య‌ర్థికి ఓట్లు వేశారు. ఇలా 14 ఓట్ల మేర‌కు అధికంగా రాధాకృష్ణ‌న్‌కు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇండియా కూట‌మిలోని మిత్ర‌ప‌క్షాలే.. ఐక్యం లేవ‌న్న సంగ‌తి స్ప‌ష్ట‌మైంది. ఈ ప‌రిణామాలు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వానికి మ‌రింత సెగ పెట్ట‌నున్నాయి. మ‌రి దీనిపై ఆయ‌న ఎలా స్పందిస్తారో చూడాలి.