బాబు ప్లేస్‌లో లోకేష్: కీలక బాధ్యతలు!

సీఎం చంద్రబాబు ప్లేస్‌లో మంత్రి నారా లోకేష్ కేంద్రంలో కీలక చక్రం తిప్పనున్నారు. మంగళవారం జరగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఓటు వేయేలా ఆయనే పర్యవేక్షణ చేయనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. దీంతో సోమవారం మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీలతో భేటీ అవుతారు. వారందరినీ కట్టుతప్పకుండా ఎన్డీయే కూటమి అభ్యర్థికి ఓటు వేయించేలా పర్యవేక్షించడంతోపాటు వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

సాధారణంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానం విభిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు ఓటు వేసే విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా వారికి అవగాహన కూడా కల్పించనున్నారు. ఈ కార్యక్రమాల పర్యవేక్షణతో పాటు బీజేపీ సీనియర్ నాయకులతోనూ మంత్రి నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మరోసారి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. సోమవారం రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న నారా లోకేష్ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పరిశీలించనున్నారు.

ఈ మేరకు పార్టీ వర్గాలకు సీఎం చంద్రబాబు సమాచారం అందించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబే స్వయంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే బుధవారం అనంతపురంలో నిర్వహించే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనాల్సిన నేపథ్యంలో చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకుని బదులుగా నారా లోకేష్‌ను పంపిస్తున్నారు.

వైసీపీ కూడా..

ఏపీ ప్రతిపక్షం వైసీపీ కూడా తన పార్టీ రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులకు తర్ఫీదు ఇచ్చే బాధ్యతను సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి అప్పగించింది. పార్టీకి చెందిన సభ్యులు ఆయన నేతృత్వంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముందుగానే వైసీపీ ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు తెలిపిన నేపథ్యం ఉంది. అందువల్ల ఆయన్నే ఓటు వేయాలని వైవీ సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక ఈ ఎన్నికల్లో పార్టీల తరఫున విప్ జారీ చేయడం ఉండదు. ఎంపీలు అవసరమైతే వారికి నచ్చిన విధంగా ఓటు వేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలు రహస్య బ్యాలెట్ విధానంలో జరగనున్నాయి. ఈవీఎంలను వినియోగించరు.