ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా కర్ణాటకలో పర్యటించారు. అక్కడి సుప్రసిద్ధ ఆదిచుంచనగరి మహాసంస్థాన మఠాన్ని ఆయన సందర్శించారు. మఠం 72వ పీఠాధిపతి జగద్గురు నిర్మలానందనాథ మహాస్వామీజీని కలుసుకుని సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం అక్కడి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మఠం నిర్వహణలో ఉన్న పలు స్కూళ్లు, మెడికల్ కాలేజీలను కూడా నారా లోకేష్ సందర్శించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. నిర్వహణ గురించి వివరాలు అడిగారు.
మొత్తంగా నారా లోకేష్ ఆదివారం పూర్తిగా ఈ మఠానికే సమయం కేటాయించారు. అయితే ఇలా మఠాలకు నారా లోకేష్ వెళ్లడం అనేది ఫస్ట్ టైమ్ అని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నారా లోకేష్ మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఏ మఠానికీ వెళ్లకపోవడం, పీఠాధిపతులకు కూడా ఆయన దూరంగా ఉండడం గమనార్హం. అలాంటిది తొలిసారి కర్ణాటకలోని ఆదిచుంచనగరి మఠానికి వెళ్లడం, స్వామితో 40 నిమిషాలపాటు చర్చలు జరపడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని మంత్రికార్యాలయం తెలిపింది. ఇక ఈ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠానికి చాలానే చరిత్ర ఉంది. దాదాపు 1800 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ పీఠానికి దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు కూడా వస్తుంటారు. ఇటీవలి కాలంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పర్యటించారు. అక్కడే ఆమెకు మఠం ఓ బిరుదును కూడా ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ పర్యటించారు. కాబట్టి దీనికి రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉందనే విషయం తెలిసిందే.
మోడీ సలహాతోనే..?
తాజాగా మంత్రి నారా లోకేష్ ఆదిచుంచనగరి పీఠాన్ని దర్శించుకోవడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ సలహా ఇచ్చి ఉంటారనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఈ పీఠాన్ని దర్శించుకున్న వారికి రాజకీయంగా మంచి పరిణామాలు వస్తున్నాయన్నది చర్చ. ఈ క్రమంలోనే నారా లోకేష్కు పీఎం సలహా ఇచ్చి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో పవన్ కళ్యాణ్కు కూడా ప్రధాని షణ్ముఖ ఆలయాలను దర్శించమని సూచించారు. దీంతో ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని షణ్ముఖ ఆలయాలను దర్శించారు. అలా తాజాగా నారా లోకేష్కు ప్రధాని ఆదిచుంచనగరి మఠాన్ని దర్శించమని సూచించి ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates