ఏపీలో ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలకు ప్రభుత్వం మేలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఆరోగ్య శ్రీ పథకం పౌరుల ఆర్థిక స్థితిగతులను బట్టి అమలవుతోంది. దీంతో, రాష్ట్రంలోని పౌరులందరికీ ఆ పథకం ప్రయోజనం లభించడం లేదు. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ వర్తించేలా ఉచిత ఆరోగ్య బీమా పథకం తీసుకువస్తానని హామీనిచ్చింది. ఈ క్రమంలోనే ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ఏపీలోని చంద్రబాబు సర్కార్ అడుగులు వేసింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ భేటీలో ఈ పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా లభించనుంది. రాష్ట్రంలోని 2493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో రూ.25 లక్షల రూపాయల వరకు ఉచితంగా 3257 వైద్య సేవలు ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. ఈ పాలసీ వల్ల ఏపీలోని 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
అంతేకాదు, 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అమలుకు అనుమతులు లభించేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దాంతోపాటు, రెండున్నర లక్షల రూపాయలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్ ను ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు. రూ.2.5లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వైద్య చికిత్సల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. దీంతోపాటు, పీపీపీ విధానంలో ఏపీలో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates