కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి హరీష్ రావు, సంతోష్ లపై కవిత షాకింగ్ ఆరోపణలు చేశారు. పార్టీలో లబ్ధిపొందాలని అనుకుంటున్న కొందరితో కలిసి హరీష్ రావు కుట్ర పన్నుతున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను విడగొట్టి పార్టీని హస్తగతం చేసుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీని విచ్ఛిన్నం చేసి తాము సొంతం చేసుకోవాలన్న కుట్రతోనే పార్టీ నుంచి తనను తొలగించేలా చేశారని హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేపు ఇదే ప్రమాదం కేటీఆర్ కు, కేసీఆర్ కు పొంచి ఉందని, వారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ స్థాపించిన మొదటి రోజు నుంచి హరీష్ రావు పార్టీలో లేరని, పార్టీ పెట్టిన 9 నెలల తర్వాత ఆయన పార్టీలో చేరారని గుర్తు చేశారు.
హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని, బబుల్ షూటర్ అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు ఒక సమస్యను సృష్టించి దానిని ఆయనే పరిష్కరించినట్లు చెప్పుకుంటారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఎప్పుడో లొంగిపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను సంతోష్, హరీష్ రావు గ్యాంగ్ జలగల్లా పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో హరీష్ రావు పేరును రేవంత్ రెడ్డి ఎందుకు ప్రస్తావించడం లేదని కవిత ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates