ఒక్క కామెంట్‌తో వైసీపీ ఓట్లన్నీ పాయె

తాము అభిమానించే పార్టీ తాము ఉంటున్న ప్రాంతంలో పోటీ చేయని.. లేదంటే ఆ పార్టీకి విజయావకాశాలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో.. తమ పార్టీతో సన్నిహితంగా ఉండే పార్టీని చూసుకుని ఓట్లేయాలని అనుకుంటారు జనాలు. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీల మధ్య ఉందన్న సంగతి స్పష్టం.

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కూడా బరిలో ఉన్నాయి కానీ.. వాటికి ముందున్న బలం ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఆ పార్టీలకు ఓట్లేసిన వాళ్లలో చాలామంది ఇప్పుడు పై రెండు పార్టీల్లో ఒకదాని వైపు చూస్తుండొచ్చు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు ఇక్కడ పోటీలో లేవు కానీ.. వాటిని అభిమానించే జనాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. జనసేన మద్దతుదారులు బీజేపీకి ఓటేయాలని దాని అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు. వైకాపా నుంచి తమ మద్దతుదారులకు అలాంటి సూచనలేమీ అందలేదు.

వైకాపా ఓట్లు టీఆర్ఎస్, బీజేపీకి సమాన స్థాయిలోనే పడొచ్చని అనుకోవచ్చు. ఆ రెండు పార్టీలతోనూ వైకాపాకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వైకాపా అభిమానుల్ని మచ్చిక చేసుకోకపోయినా వారికి ఆగ్రహం కలగకుండా చూసుకోవడం ముఖ్యం. కానీ ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన రఘునందన్ రావు.. వైసీపీ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసే కామెంట్ చేసి వారి ఓట్లు బీజేపీకి పడకుండా చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను విమర్శించే క్రమంలో ఆయన సందర్భం చూసుకోకుండా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరెత్తారు. ‘‘ఎనకటికి ఒకాయన గిట్లే మాట్లాడి గట్లే పోయిండు. పావురాల గుట్టల. నువ్వు గూడ గంతే. యాక్షన్‌కి రియాక్షన్‌ కచ్చితంగా ఉంటది’’ అని రఘునందన్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో వైకాపా బరిలో లేకపోవచ్చు కానీ.. ఆ పార్టీని, వైఎస్‌ను అభిమానించే వాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. రఘునందన్ కామెంట్ వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించి సోషల్ మీడియాలో తమ కోపాన్ని చూపిస్తున్నారు. బీజేపీకి వైఎస్ అభిమానులెవరూ ఓటేయొద్దని పిలుపునిస్తున్నారు. ఈ కామెంట్ ప్రభావం గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.