ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గురించి కొన్ని ప్రధాన పత్రికల్లో తాజాగా పతాక శీర్షిక వార్తలు వచ్చాయి. వైఎస్ వారసురాలిగా ఆమె ఏ మేరకు మార్కులు వేసుకున్నారు.. ఏ మేరకు పార్టీని పుంజుకునేలా చేశారు.. ప్రజల ఏమనుకుంటున్నారు.. అనే మూడు విషయాలపై మీడియా ప్రధానంగా దృష్టి సారించింది. ఇది ఒక మీడియాలోనే కాదు పార్టీలోనూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు పిసిసి చీఫ్ పదవిని ఇవ్వడం వెనుక ఆమె పెట్టుకున్న పార్టీని విలీనం చేయటం ఒకటే కారణం కాదు.. అన్న విషయం అందరికీ తెలిసిందే.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా ఉందని, అది తమకు ఉపయోగపడుతుందని… ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరినీ ఏకం చేసి పార్టీని బలోపేతం చేస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు దోచుకుంటారని ఇలా ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు అవకాశం కల్పించింది. అయితే, పార్టీ పగ్గాలు చేపట్టి దాదాపు సంవత్సరన్నర దాటిపోయిన తర్వాత కూడా షర్మిల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారిపోయింది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. పార్టీలోనూ ఇదే తరహా చర్చ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
వ్యక్తిగత అజెండాను పెట్టుకొని అన్నపై యుద్ధం చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంటున్నారని రఘువీరారెడ్డి వంటి సీనియర్ నాయకులు అనేక సందర్భాల్లో అంతర్గత సమావేశాల్లో చెప్పుకొచ్చారు. ఇక చాలామంది నాయకులు మౌనంగా ఉండిపోయారు. మరికొందరు పార్టీ మారిపోయారు. తాజా పరిణామాలు గమనించిన అదే పరిస్థితి గమనిస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ, 16 నెలలు గడిస్తున్న ఇప్పటికీ కాంగ్రెస్ తరపున ఒక ప్రజా పోరాటం గాని ఒక ప్రజా ఉద్యమంగానే సమస్యలపై ప్రశ్నించడం కానీ ఎక్కడ కనిపించకపోవడం వినిపించకపోవడం గమనార్హం. కేవలం అన్నను టార్గెట్గా చేసుకుని ఆయనపై విమర్శలు గుప్పించేందుకు అధికార పార్టీల తరపున వాయిస్ వినిపించేందుకు మాత్రమే పరిమితం అవుతున్నారన్న విమర్శలు జోరుగా నడుస్తున్న సమయంలో ఆమె వైయస్ మార్కును కూడా అందుకోలేకపోతున్నారన్నది మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. వాస్తవానికి వైఎస్ చరిష్మాను కనుక షర్మిల అందుకుని ఉంటే ఎప్పుడో అనేకమంది పార్టీ నాయకులు చేరువయ్యే వారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మళ్లీ కాంగ్రెస్ సౌరభాలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎవరికి వారు ఎక్కడికక్కడ షర్మిల విషయంపై మౌనంగానే ఉన్నారు.. తప్ప ఆమె వ్యవహరిస్తున్న తీరును మాత్రం జీర్నించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ వారసురాలిగా ఆమె విఫలమయ్యారు అన్నది ప్రస్తుతం పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి మునుముందు కూడా ఇలాగే కొనసాగితే ఆమెకు కేవలం నాయకురాలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates