వైసీపీ… చిత్త శుద్ధి లేని శివ‌పూజ‌లు.. !

వైసిపి అధినేత జగన్ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకులు త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా దీక్షలకు దిగుతున్నారు. విశాఖపట్నం లోని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు అందరికీ తెలిసిందే. పైకి ప్రైవేటీకరణ లేదని రాష్ట్రస్థాయిలో బిజెపి నాయకులు ఎవరూ చెప్పడం లేదు. కానీ కూటమిలోని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. సీఎం చంద్రబాబు చూచాయిగా చెబుతున్నారు. ఇంతకుమించి మిగిలిన నాయకులు ఎవరూ మాట్లాడటం లేదు.

ఇక కేంద్రం నుంచి దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. మరోవైపు ఉన్నటువంటి విభాగాల్లో కీలకమైన ఫర్నజ్ బ్లాస్ట్ సహాగ‌నులు వంటి వాటిని ప్రైవేటీకరించేందుకు 34 విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈనెల 5వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందని యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్మికులు తమకు అండగా ఉండే వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ నేనున్నానంటూ వారికి పక్షాన నిలబడి దీక్షలకు సిద్ధమవుతోంది.

అయితే, ఇవి ఏ మేరకు ఫలిస్తాయి.. వైసిపి చేస్తున్నటువంటిది రాజకీయమా లేకపోతే నిజంగానే కార్మికుల పట్ల ఉక్కు కర్మాగారం పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి ఉంది అనేది ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఎందుకంటే వైసిపి అధికారంలో ఉండగానే విశాఖపట్నం కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించినద‌రిమిలా.. కేంద్ర మంత్రివర్గం కూడా దీన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. దీనిపై ఇప్పటివరకు న్యాయపోరాటం కానీ వైసీపీ తరఫున ఎటువంటి బలమైన వాదనలు కానీ వినిపించలేదు. ప్రస్తుతం మాత్రమే రాజకీయంగా చూస్తూ దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా వైసిపి అడుగులు వేస్తున్నది.

నిజంగానే కార్మికుల ప‌క్షాన‌ నిలబడితే కచ్చితంగా వైసీపీకి మేలు చేస్తుంది. కానీ, గతంలో ఏం చేసింది అన్నది చూస్తే మాత్రం విమర్శలు స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడైనా చిత్తశుద్ధి లేని శివ పూజలాగా పైపైకే దీక్షలు చేసి వదిలిపెడతారా.. నిజంగానే సాధిస్తారా.. అనేది చూడాలి. వాస్తవానికి దీక్షలు అంటే సాధారణంగా రిలే నిరాహార దీక్షలు ఉంటాయి. ఉదయం పూట టిఫిన్ చేసి వచ్చి సాయంత్రం వరకు కూర్చోవడం వెళ్లిపోవడం వరకే కనిపిస్తాయి. మరి వైసీపీ ఇలాంటి దీక్షలను ఎంచుకుంటే మరింత డ్యామేజీ కావడం ఖాయమని విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులే చెబుతుండడం గమనార్హం.